శుద్ధ జలమేనా?
ABN , First Publish Date - 2022-05-11T05:06:06+05:30 IST
విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. ఇంటింటికీ వచ్చి నీటి అమ్మకాలు చేపట్టడంతో ప్రజలంతా మినరల్ వాటర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు నీటిని శుద్ధి చేసే సమయంలో ప్రమాణాలు పాటించడం లేదు.!!
ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు!
మినరల్ వాటర్ పేరిట జనాన్ని దోపిడీ చేస్తున్న వైనం
చూసీచూడనట్లు వదిలేస్తున్న అధికారులు!
మెదక్మున్సిపాలిటీ, మే10: మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా తాగేనీరు సైతం మినరల్గా మారిపోయింది. ఒకప్పుడు కుళాయిలు, బోరు బావుల ద్వారా వచ్చే నీటినే పట్టి తాగేవారు. ప్రస్తుతం మినరల్ వాటర్ తాగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. ఇంటింటికీ వచ్చి నీటి అమ్మకాలు చేపట్టడంతో ప్రజలంతా మినరల్ వాటర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు నీటిని శుద్ధి చేసే సమయంలో ప్రమాణాలు పాటించడం లేదు.!!
అపరిశుభ్రంగా ప్లాంట్లు!
ప్లాంట్ల పరిసరాలు, యంత్ర పరికాల శుభ్రత పాటించడం లేదు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సుమారు 20కి పైగా నీటి శుద్ధి కేంద్రాలు (వాటర్ ప్లాంట్లు) ఉన్నాయి. వీటి నిర్వాహకులు నెలలో రెండుసార్లు వారు అమ్ముతున్న నీటి నమూనాలను డీఐఎస్ సంస్థకు పరీక్షల నిమిత్తం పంపించాలి. అంతే కాకుండా మైక్రో బయాలజి్స్టతో ఎప్పటికప్పుడు నీటి స్వచ్ఛతను పరీక్షించాలి. కానీ జిల్లా కేంద్రంలో ఒక్క నీటి శుద్ధి కేంద్రంలో కూడా ఈ విధానం అమలు కావడం లేదు. వినియోగించే పరికరాలు సైతం స్టేయిన్లె్స స్టీల్ పైపులు ఉండాలి. కానీ తక్కువ ఖర్చులో లభించే ప్లాస్టిక్ పైపులను వాడుతున్నారు. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే నీటిని శుద్ధి చేసే సమయంలో క్రిములను సంహరించేందుకు వివిధ రకాల రసాయనిక మందులను నిర్వాహకులు వినియోగిస్తున్నారు. ఈ నీటిని తాగే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. నీటి క్యాన్లలో ఫంగస్ రాకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్తో శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఫ్లోరిన్ 1 శాతం, ఐరన్ 0.1 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నీరు తెలుపు రంగులోనే ఉంటూ వాసన రాని తక్కువ తియ్యదనం కలిగి ఉండాలి. పీహెచ్ స్థాయి 6.0-8.5 ఉండాలి. ఈ ప్రమాణాలను నిర్వాహకులు పాటించడం లేదు.
పర్యవేక్షణ కరువు
మెదక్ పట్టణంలో 20కి పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీరు మున్సిపాలిటీ అనుమతితో పాటు డీఎ్సఐ, భూగర్భ జల శాఖ ద్వారా అనుమతులు పొంది ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారీతిగా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తాగునీటిని విక్రయిస్తున్నారు. ఇళ్లలోనే పరికరాలు బిగించుకుని బోర్ల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. అవి సురక్షితం కావని తెలిసినా అలవాటు పడిన ప్రజలు వాటి వైపే మొగ్గుచూపుతున్నారు. ప్లాంట్లు నిర్వాహణ అనుమతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన ఆహారభద్రత (ఫుడ్సేఫ్టీ), మున్సిపల్, భూగర్భజలశాఖ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.