Instagramలో యువతితో పరిచయం.. Parents లేని టైమ్లో ఇంటికెళ్లి.. కూల్డ్రింక్ కోసం పంపించి..!
ABN , First Publish Date - 2022-05-05T14:17:56+05:30 IST
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతితో స్నేహం చేస్తూ ఆమె
- యువతి ఇంటికి కన్నం
- నిందితుడి అరెస్టు
- 24.5 తులాల బంగారు నగలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ/కూకట్పల్లి : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతితో స్నేహం చేస్తూ ఆమె ఇంటికే కన్నం వేశాడు ఓ యువకుడు. రూ. 4.80 లక్షల విలువైన 24.5 తులాల బంగారు నగలు, రూ. 10 వేలు చోరీ చేశాడు. నిందితుడిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, లింగంపేట మండలం, బోనాల్ గ్రామ సమీపంలోని చింతగుట్టతండాకు చెందిన బానోత్ సురేష్(22) ఉద్యోగం కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్లో స్నేహితులతో కలిసి ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం Instagramలో మూసాపేటకు చెందిన మేఘన అనే యువతి అతడికి పరిచయమైంది. ఆమెతో తరచూ చాటింగ్ చేస్తూ.. ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మేఘన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇదే అదునుగా మేఘన ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు.
కూల్డ్రింక్ కోసం పంపించి..
గతనెల 20న ఇంట్లో మేఘన ఒక్కరే ఉన్నారు. విషయం తెలుసుకున్న సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. తనకు దప్పికగా ఉందని.. కూల్డ్రింక్ కావాలని యువతిని కోరాడు. ఆమె కూల్డ్రింక్ తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సురేష్ బీరువాలో ఉన్న 24.5 తులాల బంగారు నగలు, రూ. 10 వేలు దొంగిలించాడు. ఆమె కూల్డ్రింక్ తీసుకురాగానే తాగి వెళ్లిపోయాడు. మే-01న మేఘన తల్లిదండ్రులు డబ్బు తీసుకునేందుకు బీరువా తలుపులు తెరవగా డబ్బు, నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేఘన ఇచ్చిన సమాచారం మేరకు సురేష్పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి 24.5 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. Social Media లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు.