విమర్శలతో దిగొచ్చిన Indigo.. ఆ కుర్రాడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తామన్న సీఈవో

ABN , First Publish Date - 2022-05-09T22:17:45+05:30 IST

దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కించుకునేందుకు నిరాకరించడంతో తీవ్ర విమర్శలు పాలైన ఇండిగో ఎయిర్ లైన్స్

విమర్శలతో దిగొచ్చిన Indigo.. ఆ కుర్రాడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తామన్న సీఈవో

రాంచీ: దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కించుకునేందుకు నిరాకరించడంతో తీవ్ర విమర్శలు పాలైన ఇండిగో ఎయిర్ లైన్స్ (Indigo Airlines) ఎట్టకేలకు దిగొచ్చింది. జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా.. బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొని ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఓ కుటుంబం తమ దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్ పోర్టుకు వచ్చింది.


అయితే, బాలుడు భయాందోళనతో ఉన్నాడన్న కారణంతో వారిని విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. అతడి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వారిని ప్రయాణించేందుకు అనుమతించలేదు. ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులకు, విమాన సంస్థ సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ వారిని విమానం ఎక్కించుకునేందుకు నిరాకరించారు.


ఈ ఘటన మొత్తాన్ని ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఇండిగో సంస్థ తీరుపై విమర్శల వర్షం కురిపించారు. మరోవైపు, విమానయాన సంస్థ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ( Jyotiraditya Scindia) కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది సహించరానిదని, దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, దర్యాప్తును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. 


వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడంతో స్పందించిన ఇండిగో సీఈవో దత్తా మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న తల్లిదండ్రులను ఈ సమాజంలో నిజమైన హీరోలగా తాము గుర్తించినట్టు చెప్పారు. బాధిత కుటుంబానికి ఎదురైన దురదృష్ట ఘటనకు చింతిస్తున్నట్టు చెప్పారు. వారి జీవితకాల అంకితభావానికి ప్రశంసగా తమ వైపు నుంచి వారి కుమారుడికి  ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ను కొని ఇస్తామని దత్తా ప్రకటించారు. 



Updated Date - 2022-05-09T22:17:45+05:30 IST

Read more