లబ్ధిదారులకు ‘ఇంటి’ తిప్పలు

ABN , First Publish Date - 2022-05-10T05:43:02+05:30 IST

మండల కేంద్రమైన సిద్దవటం గ్రామ సమీపంలోని జగనన్న లేఅవుట్‌ కాలనీలో మౌలిక వసతుల కొరత లబ్ధిదారులకు సంకటంగా మారింది. ఇంటిని నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నా నీరు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పనులకు ఆటంకంగా మారింది. బేస్‌మట్టం వేసేందుకు సుమారు రూ.5 వేలు ఖర్చు చేసుకొని ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లబ్ధిదారులు నారాయణమ్మ, బసరోన్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లబ్ధిదారులకు ‘ఇంటి’ తిప్పలు
జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి నీటిని అందించాలని వేడుకుంటున్న లబ్ధిదారులు

నీటి కొరతతో ఆగిపోతున్న పునాదులు 

ఇదీ సిద్దవటం జగనన్న లేఅవుట్‌లో దుస్థితి 

సిద్దవటం, మే 9: మండల కేంద్రమైన సిద్దవటం గ్రామ సమీపంలోని జగనన్న లేఅవుట్‌ కాలనీలో మౌలిక వసతుల కొరత లబ్ధిదారులకు సంకటంగా మారింది. ఇంటిని నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నా నీరు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పనులకు ఆటంకంగా మారింది. బేస్‌మట్టం వేసేందుకు సుమారు రూ.5 వేలు ఖర్చు చేసుకొని ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లబ్ధిదారులు నారాయణమ్మ, బసరోన్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వలన ఇంటి నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని వారు వాపోతున్నారు. ఈ కాలనీలో 137 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాల మంజూరు కాగా, వాటిలో కేవలం పది మంది మాత్రమే బేస్‌మట్టం పూర్తి చేశారు. అధికారులు లబ్ధిదారుల బేస్‌మట్టం నిర్మాణం కొరకు నీరు అందించకపోవడం వల్ల లబ్ధిదారులే ఒక ట్యాంకర్‌ నీటిని రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి బేస్‌మట్టం పనులను కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా నీటి సమస్య తీర్చేందుకు కొత్త బోర్‌ ఏర్పాటు కొరకు టెండర్‌ పూర్తైన వెంటనే తాగునీటి సరఫరా ఏర్పాటు చేస్తామని, అలాగే విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ ద్వారా లబ్ధిదారుల గృహాలకు నీటి సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. 



Read more