స్నేహంగా ఉన్నాడు.. Friend ఫోన్ తీసుకుని తండ్రికి బాగా లేదని.. డబ్బులు పంపించమని మెసేజ్లు.. తీరా చూస్తే..
ABN , First Publish Date - 2022-05-09T15:15:50+05:30 IST
స్నేహంగా ఉన్నాడు.. Friend ఫోన్ తీసుకుని తండ్రికి బాగా లేదని.. డబ్బులు పంపించమని మెసేజ్లు.. తీరా చూస్తే..
- స్నేహం పేరుతో మోసం
- ఫోన్ తీసుకుని డబ్బులు కాజేసిన కేటుగాడు
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : స్నేహంగా ఉన్నాడు.. స్నేహితుడి ఫోన్ తీసుకుని తండ్రికి బాగా లేదని.. డబ్బులు పంపించమని అతడి బంధువులకు, స్నేహితులకు మెసేజ్లు పంపాడు. రూ.1.14 లక్షలు జమ కాగానే ఉడాయించాడో కేటుగాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన అమన్ జోషి (28) కొంత కాలం అత్తాపూర్లో ఉన్నాడు. పిల్లర్ నెంబర్ 143 వద్ద గల పాన్షాప్కు తరచూ వచ్చేవాడు.
అక్కడ శివరాంపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ప్రణయ్కుమార్(23)తో స్నేహం ఏర్పరుచుకున్నాడు. అవసరాల నిమిత్తం ప్రణయ్ నుంచి రూ. 20 వేలు కావాలని తీసుకుని, కొన్ని రోజుల తర్వాత రూ.40 వేలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. అలా పలు దఫాలుగా చేశాడు. అప్పుడప్పుడు ప్రణయ్కుమార్ ఫోన్ వాడుకునేవాడు. ఈ క్రమంలో అతడి ఏటీఎం, పిన్ నెంబర్లు కూడా తెలుసుకున్నాడు. వారం క్రితం తన ఫోన్ పాడైందని చెప్పి ప్రణయ్ ఫోన్ తీసుకున్నాడు. ‘మా నాన్నకు బాగోలేదు. డబ్బులు పంపించాలి’ అంటూ ప్రణయ్కుమార్ స్నేహితులకు, బంధువులకు అమన్జోషి మెసేజ్లు పెట్టాడు.
నమ్మిన కొందరు పలు దఫాలుగా రూ. 1.4 లక్షల వరకూ పంపారు. వాటిని అమన్జోషి తన ఖాతాలకు మళ్లించుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత మోసాన్ని పసిగట్టిన ప్రణయ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అమన్జోషి పరారయ్యాడు. డీఐ పవన్కుమార్ దర్యాప్తు ప్రారంభిగా, అమన్జోషి మోసాల గురించి తెలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రణయ్తోనే కాకుండా పలువురితో కూడా స్నేహం నటించి డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. 2019లో జైలుకెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అమన్జోషి కోసం గాలిస్తున్నట్లు డీఐ తెలిపారు.