HYD : ఆ విషయం తెలిసి దత్తపుత్రుడి మృతదేహాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరణ.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2022-05-14T17:23:52+05:30 IST
ఆ విషయం తెలిసి దత్తపుత్రుడి మృతదేహాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరణ.. అసలేం జరిగిందంటే..!
- హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్ సిటీ/దిల్సుఖ్నగర్/చాదర్ఘాట్ : పెంపుడు తల్లిని (Mother) హత్య చేసి తర్వాత తానూ హత్యకు గురైన దత్తపుత్రుడి మృతదేహ్నాన్ని తీసుకునేందుకు పెంపుడు తండ్రి అంగీకరించలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితులను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ (Arrest) చేశారు. ఐదు రోజుల క్రితం పెంపుడు తల్లి భూదేవిని హత్య చేసిన సాయి తేజ (Sai Teja) మూడు రోజుల క్రితం అమ్రాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లెల తీర్థం వద్ద హత్యకు గురయ్యాడు. అనేక మలుపులు తిరిగిన తల్లి, దత్తపుత్రుడి వేర్వేరు హత్య కేసుల్లో డ్రైవర్, అతని స్నేహితుడే సూత్రధారులుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
కొడుకుగా భావించడం లేదు..
దత్తపుత్రుడు సాయితేజ మృతదేహాన్ని తీసుకోవడానికి తండ్రి (Father) జంగయ్య యాదవ్ నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పెంచిన మమకారాన్ని మరిచి, తన భార్యను దారుణంగా చంపిన వ్యక్తిని కొడుకుగా (Son) భావించడం లేదని పేర్కొన్న ట్లు తెలిసింది. దాంతో సాయితేజ మృతదేహాన్ని ఆమ్రాబాద్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిద్దపురం గ్రామానికి చెందిన కారింగుల నర్సింహ్మ అలియాస్ నాని (24) కారు డ్రైవర్. ఇతని స్నేహితుడైన చంపాపేట కాలనీ నివాసి వట్టికోటి శివ (23), సరూర్నగర్ ప్రగతి నగర్ నివాసి అడ్డాకుల హర్ష అలియాస్ చింటూ అలియాస్ విక్టరీ బాబు (22) బైక్ మెకానిక్. సైదాబాద్ సింగరేణి కాలనీ నివాసి బోయినపల్లి సాయిగౌడ్ (22) జీహెచ్ఎంసీ వర్కర్. ఇదే ప్రాంతానికి చెందిన అర్కటం ఆంజనేయులు అలియాస్ అంజి (21) దత్తపుత్రుడైన సాయితేజతో కలిసి నగలు, నగదు చోరీకి ప్లాన్ వేశారు. చోరీ క్రమంలో ఈ నెల 7న సాయితేజ పెంపుడు తల్లి భూదేవి (50)ని హత్య చేశాడు. అనంతరం సాయితేజను శివ శ్రీశైలంకు తీసుకెళ్లి మల్లెల తీర్థం వద్ద హత్య చేసి వాగులో పడేశాడు. అనంతరం సరూర్నగర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అతడి సమాచారం మేరకు హత్యకేసుతో సంబంధం ఉన్న డ్రైవర్ నర్సింహ్మ, శివ, హర్ష, సాయిగౌడ్, ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు.