జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు
ABN , First Publish Date - 2022-05-14T06:52:46+05:30 IST
ఎమ్మెల్సీ కవిత ప్రోద్భలంతో జిల్లాలో రాయలసీమలాగా ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అన్నపూర్ణమ్మ విమర్శించారు.
పెద్దబజార్, మే 13: ఎమ్మెల్సీ కవిత ప్రోద్భలంతో జిల్లాలో రాయలసీమలాగా ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అన్నపూర్ణమ్మ విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీగా ఉన్నప్పుడు, సీఎం కూతురుగా జిల్లాకు ఏం చేశారని కవితను ప్రశ్నించారు. అమాయకులను, యువతను రెచ్చగొట్టి వారిని తప్పుదోవపట్టిస్తున్న కవిత హుందాగా రాజకీయాలు చేయాలని హితవు పలికారు. సీఎం కూతురుగా ఎమ్మెల్సీ కవిత జిల్లాకు చేసిందేమిలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ఒక టూరిస్ట్ లాగా వచ్చి మీడియా సమావేశం పెట్టి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఎంపీ అర్వింద్ మీద కవిత దాడిచేయమని చెప్పడం దారుణమన్నారు. రైతంగానికి ఇచ్చిన హామీలను విస్మరించినందునే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతే జిల్లాకు వచ్చారన్నారు. ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు కోసం ప్రయత్నిస్తున్నారని అప్పటి వరకుప్రత్యామ్నయంగా స్పైసెస్బోర్డు తెచ్చారని, పనులు ఆపలేదని నిధులు ఆపలేదని ఆమె గుర్తుచేశారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఇందల్వాయి టోల్గేట్ దాటి అడుగుపెట్టలేరని కవిత గుర్తుంచుకోవాలని అన్నారు. ఎంపీ అర్వింద్పై దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుధన్పాల్ సూర్యనారాయణగుప్తా, దినేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, ప్రవళిక, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.