-
-
Home » Andhra Pradesh » Kadapa » Facilities at the bus stand-MRGS-AndhraPradesh
-
బస్టాండులో సౌకర్యాలు నిల్
ABN , First Publish Date - 2022-05-09T05:28:30+05:30 IST
రాయచోటి జిల్లా కేంద్రమైనా ఇక్కడి బస్టాండులో సౌకర్యాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. చిత్తూరు, కడప, తిరుపతి, బెంగుళూరు, చెన్నై ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్టాండుకు వస్తుంటారు. ప్రయాణికులకు కనీసం తాగడానికి నీరు, కూర్చోవడానికి కుర్చీలు లేక, నిలబడేందుకు వీలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్నపిల్లలతో గంటల తరబడి నిలబడాల్సిందే
రాయచోటిలో ఇదీ ప్రయాణికుల దుస్థితి
రాయచోటి(కలెక్టరేట్), మే 8: రాయచోటి జిల్లా కేంద్రమైనా ఇక్కడి బస్టాండులో సౌకర్యాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. చిత్తూరు, కడప, తిరుపతి, బెంగుళూరు, చెన్నై ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్టాండుకు వస్తుంటారు. ప్రయాణికులకు కనీసం తాగడానికి నీరు, కూర్చోవడానికి కుర్చీలు లేక, నిలబడేందుకు వీలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలతో బస్టాండుకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.
రాయచోటి జిల్లా కేంద్రమైన నేపథ్యంలో దాదాపు మూడు వందల మంది ఉద్యోగులు బయట ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఈ బస్టాండుకు వచ్చివెళ్తుంటారు. ఇందుకు తగ్గ వసతులు కల్పించకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు కూడా కల్పించలేని ఆర్టీసీ సిబ్బందిపై మండిపడుతున్నారు. బస్టాండు ఆవరణలో ఫ్యాన్లు, టీవీలు, సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయని, బస్టాండు ఆవరణలో ఉన్న అంగళ్లు, కూల్డ్రింక్ షాపులు వారు ఉన్న రేట్ల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇవేవీ పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం బస్టాండు ఆవరణలో ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
20 ఏళ్ల నుంచి ఇలాగే...
20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. జిల్లా అయినంత మాత్రాన ఈ ఊరు మారదు. ఈ బస్టాండు మారదు.
- నాగేంద్ర, ప్రయాణికుడు
అధికారులు పట్టించుకోలేదు
అధికారులు పట్టించుకోలేదు. బాత్రూంకు వెళ్లాలంటే ముక్కుమూసుకోవాల్సిందే. ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు.
- చిన్నప్ప, ప్రయాణికుడు
తాగునీరు ఏర్పాటు చేశాం
తాగునీరు ఏర్పాటు చేశాం. మిగతా సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తాం. ప్రయా ణికులకు ఏ ఇబ్బందులు కలగనివ్వం.
- ఆర్టీసీ డీఎం, రాయచోటి