ప్రతీ విద్యార్థి ఓ చరిత్రకారుడవ్వాలి
ABN , First Publish Date - 2022-05-13T04:47:50+05:30 IST
ప్రతీ విద్యార్థి ఒక చరిత్రకారుడు కావాలని, వారు పుట్టి, పెరిగిన ఊరికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సున్నితంగా పరిశీలించి రాబోయే తరాల వారికి తమ గ్రామచరి
తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్
ఖమ్మంలో ‘మన ఊరు మన చరిత్ర.. మన చరిత్రను మనమే రాసుకుందాం’
ఖమ్మంఖానాపురంహవేలి, మే 12 : ప్రతీ విద్యార్థి ఒక చరిత్రకారుడు కావాలని, వారు పుట్టి, పెరిగిన ఊరికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సున్నితంగా పరిశీలించి రాబోయే తరాల వారికి తమ గ్రామచరిత్రను పుస్తకం రూపంలో అందించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. గురువారం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎనఆర్ కళాశాలలో జరిగిన తెలంగాణ సాహిత్య అకాడమీ తెలుగు చరిత్ర, ఐక్యుకేసీ సంయుక్త ఆధ్వర్యంలో మన ఊరు మన చరిత్ర, మన చరిత్రను మనమే రాసుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జూలూరు గౌరీశంకర్, కలెక్టర్ వీపీగౌతమ్ హాజరయ్యారు. తొలుత గౌరీశంకర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి చరిత్ర నిజమైన చరిత్రగా అభివర్ణించాలని, తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకున్న చొరవ వల్ల చరిత్రరూపంతోపాటు ప్రజాస్వామిక చరిత్ర అందించవచ్చని, విద్యార్థులకు సూచించారు. తెలంగాణ వచ్చాక మన చరిత్ర, మన ఊరు, మన సంస్కృతి గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. విద్యార్థులు తమ ఊరు గురించి భౌగోళిక విశిష్టతలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలను తెలుసుకోవాలని సూచించారు. ఊరు ఎప్పుడు పుట్టింది, ఎలాంటి రూపం తీసుకుందో పరిశోఽధనాత్మకంగా ప్రతీ ఒక్క విద్యార్థి విశ్లేషించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి ఇప్పటి వరకు చరిత్రకు దొరకని అంశాలను వీరతెలంగాణ సాయుధపోరాట అంశాలను తెలుసుకోవాలని అందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఉత్తమ గ్రంథాలను వెలువరిస్తోందన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ మన చరిత్రను మనం తెలుసుకోకపోతే మన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని, మన పూర్వీకుల చరిత్రను మన ఊరు మన చరిత్ర ద్వారా తెలుసుకోవాడానికి అవకాశం దొరుకుతుందన్నారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమి రూపొందించిన త్రైమాసిక పత్రిక పునాసను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ మన ఊరు మన చరిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు కుటుంబ, గ్రామ, సాంస్కృతిక వివరాలతోపాటు రాజకీయ, ఆర్థిక, స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల జీవిత చరిత్రలను తెలుసుకుని వాటిని పుస్తకరూపంలో అందించాలని, వీటికి కావాల్సిన సమాచారాన్ని జిల్లా అధికారులు అందించి సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకీరుల్లా, తెలంగాణ సాహిత్య హైదరాబాద్ అధ్యక్షుడు కోయ చంద్రమోహన, ఐక్యుకేసీ సమన్వయకర్త సత్యవతి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ సీతారాం, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ జె.రమేష్, వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.