తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2022-05-14T18:02:32+05:30 IST
వరి ధాన్యం, ఉప్పు బియ్యం (Rice) కొనుగోలు విషయంలో తెలంగాణ..
హైదరాబాద్ సిటీ : వరి ధాన్యం, ఉప్పు బియ్యం (Rice) కొనుగోలు విషయంలో తెలంగాణ వర్సెస్ కేంద్ర ప్రభుత్వాలుగా (Telangana Govt) పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. తెలంగాణ నుంచి మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని మోదీ సర్కార్ (Modi Sarkar) నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన రూపంలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. బియ్యం భారత ఆహార సంస్థ (FCI) కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే ఈ అవకాశం కల్పించినట్లు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొన్నది.
తెలంగాణలో 2020-21 రబీ సీజన్లో సేకరించాల్సిన గడువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇటీవల మే- 2022 వరకు ఏడోసారి పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. జూన్- 2022 వరకు సేకరణ కాలం, సెప్టెంబర్- 2022 వరకు మిల్లింగ్ వ్యవధితో KMS 2021-22 (రబీ పంట)లో తెలంగాణలో 40.20 LMT బియ్యం సేకరణ అంచనాను కేంద్రం ఆమోదించింది. అంతేకాదు.. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో సేకరణ కార్యకలాపాలకు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిస్తుందని ప్రకటనలో కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది.