దేశానికి దారిచూపేది కేసీయారే!

ABN , First Publish Date - 2022-05-10T06:42:14+05:30 IST

ఏప్రిల్ 27, 2022న హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారతదేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక పటిష్టమైన జాతీయ...

దేశానికి దారిచూపేది కేసీయారే!

ఏప్రిల్ 27, 2022న హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారతదేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక పటిష్టమైన జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా ఉండాలని సోదాహరణంగా చెప్పారు. ఆయన జాతీయ రాజకీయాలలో గుణాత్మక మార్పులో ఒక భాగమై, వాటిలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారనటానికి దీన్ని ఒక సంకేతంగా భావించవచ్చు.


కేసీఆర్ మాటల్లోని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరో ‘యల్లయ్యనో, మల్లయ్యనో’ (ఆయన మాటల్లోనే) ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలన్నది ఆయన ఆలోచన కాదని స్పష్టంగా తెలుస్తున్నది. తాను ప్రతిపాదిస్తున్న జాతీయ ప్రత్యామ్నాయ అజెండా అమలు కావాలని, తద్వారా స్వాతంత్ర్య ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికి చేరాలని కేసీఆర్ అంటున్నారు. మరోవిధంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం కావాల్సింది దేశాభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయ అజెండా మాత్రమే కాని, అందరూ భావిస్తున్నట్లు ప్రత్యామ్నాయ రాజకీయ పునరేకీకరణ మాత్రం కాదు.


తన ప్రసంగంలో భాగంగా బ్రహ్మాడంగా విజయవంతమైన తెలంగాణ నమూనా అభివృద్ధిని, సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా అమలుపరిచే విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్న నేపథ్యంలో, ఆయన నేతృత్వంలో బీజేపీ ప్రచారం చేస్తున్న హిందుత్వ సిద్ధాంతాన్ని కేసీఆర్ నిశితంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం సాగినంతసేపు ‘దేశ్ కీ నేతా కేసీఆర్’ అనే నినాదాలు ప్లీనరీలో పాల్గొన్న ప్రతినిధుల నుంచి వినిపించాయి.


కేసీఆర్ ప్రకటించిన ప్రత్యామ్నాయ ఎజెండా నేపథ్యంలో ఒక్కసారి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని నిశితంగా విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు అవగతమవుతాయి. బహుశా అందుకే కావచ్చు– జాతీయ రాజకీయాలకు తన అవసరం కావాల్సి వస్తే దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అవును నిజమే, దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అత్యంత అవసరం. దేశ ప్రజలు ప్రబలమైన మార్పు కోరుకుంటున్నారనేది వాస్తవం. ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే కాబట్టి, ఆ రెండు పార్టీలు మార్చిమార్చి దేశాన్ని పరిపాలిస్తున్నా, పథకాల పేర్లు మారుతున్నాయి తప్ప, ప్రజల ముఖ్యంగా రైతుల జీవన స్థితిగతుల్లో ఏ మార్పూ రాలేదు.


ఆవిర్భవించిన అనతికాలంలోనే కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారం అందుకున్న రాజకీయ శక్తుల చరిత్ర జగద్విదితం. జనతా పార్టీ కానీ, ఎన్టీఆర్ తెలుగుదేశం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇందుకు చక్కటి ఉదాహరణలు. ఆమాటకొస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన కొద్దిరోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ప్రభంజనం ఎలా ప్రారంభమవుతుందో ఎవరూ ఉహించలేరు. సమయం అన్నీ నిర్ణయిస్తుంది. పనిమాత్రం ఆగదు.


కాంగ్రెస్–బీజేపీలకు జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయ అజెండా అనే కేసీఆర్ ఆలోచన, ఏవో చిన్నాచితకా రాజకీయ పార్టీలను ఐక్య సంఘటనగా ఏర్పరిచి తాత్కాలిక రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలను సమైక్యం చేసి, సంఘటితపరిచి, తద్వారా దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ అజెండా రూపంలో ఒక ఉమ్మడి కార్యాచరణ రూపకల్పన చేయడమే కేసీఆర్ లక్ష్యం అనే భావన ఆయన మాటలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.


తెలంగాణ రాష్ట్రం తన వినూత్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలే ప్రత్యామ్నాయ జాతీయ అజెండా అయితే దేశాభివృద్ధి అలవోకగా జరుగుతుంది. భారతదేశం గొప్పది కావాలంటే, తెలంగాణ తరహాలోనే జాతి పునర్నిర్మాణం, పునర్ నిర్వచనం, పునః సృష్టి జరగాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను, పద్ధతులను, అలవాట్లను, నడవడులను సేకరించి, అధ్యయనం చేసి, వాటిని మన దేశ స్థితిగతులకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి. దేశ ఆర్థిక పరపతిని గణనీయంగా పెంచి, ఏయే రంగాల్లో మనం వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకుని తదనుగుణంగా తప్పొప్పులు సరిచేసుకుంటూ ముందడుగు వేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఇవన్నీ దృష్టిలో వుంచుకుని, జాతీయ అభివృద్ధి ప్రత్యామ్నాయ అజెండా రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. దాని రూపకర్త కేసీఆర్ కావాలి.


పలు రంగాల నిపుణులు, సీనియర్ పాలనాధికారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, సమాజ అభ్యున్నతి కోరే ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రగా, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను, విధానాలను, శాసనాలను, పద్ధతులను, అభ్యాసాలను అధ్యయనం చేసి, సంస్కరణల కోణంలో అవసరమైన మార్పులూచేర్పులూ చేసి, మార్పు దిశగా రోడ్ మ్యాప్‌ను రూపొందించి ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు చురుగ్గా భాగస్వాములు కావాలి. ఇదే క్రమేపీ జాతీయ అభివృద్ధి అజెండా రూపకల్పనకు దారితీస్తుంది.


బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం దేశాభివృద్ధి అవకాశాలు అంతగా కనిపించడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలయింది. ఇంకా ఇలానే ఉంటే నష్టపోతాం. దేశానికి కావాలి ఉత్తేజపూరితమైన నూతన నాయకత్వం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీస అవసరాలకు నోచుకోలేని బీద సాద పేదవారు కోట్లల్లో వున్నారు. చాలామంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మనుగడ సాగిస్తున్నారు. మనతో పాటే స్వాతంత్ర్యం తెచ్చుకున్న అనేక దేశాలు, ఆదిలో బీదరికంలో ఉన్నా, రోజులు గడుస్తున్నకొద్దీ బ్రహ్మాండమైన వృద్ధి, అభివృద్ధి సాధించి, ఆర్థికంగా పుంజుకొని, మనకంటే గణనీయంగా పురోగతి సాధించాయి. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.


మన దేశానికి కావాల్సింది, మన అవసరాలకు అనుగుణమైన వాతావరణం. దాన్ని సరిగ్గా వాడుకునే నాయకత్వం. మన ఆర్థిక వ్యవస్థ పరపతినీ, మన సంపదనూ, మన అంతర్గత శక్తిసామర్థ్యాలనూ, మన అపార వనరుల సంపదనూ సక్రమంగా ఉపయోగించుకోలేమా? అలా జరక్కుండా ఎవరు నిరోదిస్తున్నారు? ఇదేమీ అత్యంతక్లిష్టమైన, అసాధ్యమైన కార్యం కాదు. కావాల్సిందల్లా మనసుపెట్టి మార్గం ఆలోచించడమే. గత 75ఏళ్ళ మాదిరిగా, మూసపద్ధతిలో ఆలోచనలు చేయకుండా, వినూత్నంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం అసాధ్యం కానేకాదు.


రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇరు రాజకీయ పార్టీలు ఒకరికి మరొకరు మాత్రమే ప్రత్యామ్నాయమనే భావన పోవాలి. కొత్త నాయకత్వం రావాలి. అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లగలిగే ప్రత్యామ్నాయ జాతీయ అజెండా రూపుదిద్దుకోవాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజిక, న్యాయ, ఇతర రంగాల్లో ప్రజాప్రయోజనకరమైన సంస్కరణలకు నాంది పలకాలి. బహుశా తెలంగాణ ముఖమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదేపదే చెప్తూ వస్తున్న ప్రత్యామ్నాయ అజెండా వీటన్నిటికీ సమాధానం కావచ్చు.


కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కాలంలో– ఆయనేం చేయలేడని హేళన చేసారెందరో. చివరకు ఏం జరిగింది? ఆబాలగోపాలాన్ని, ఆసేతుహిమాచలంలోని రాజకీయ పార్టీలన్నిటినీ ‘జై తెలంగాణా’ నినాదానికి అనుకూలంగా మలచుకున్నారాయన. ఇదే స్ఫూర్తి జాతీయ రాజకీయాలలో కూడా కొనసాగదా? బీజేపీలో కాని, కాంగ్రెస్ పార్టీలో కాని ప్రత్యామ్నాయ అజెండా అమలుపరచగల స్థాయి నాయకులు లేరనే చెప్పాలి. దేశంలో జాతీయ స్థాయిలో రాజకీయ దౌర్బల్యం, దుర్బలత్వం చోటు చేసుకున్నాయి. ప్రజలు సంఘటితం కావాలి. ఏకతాటిపై నిలబడాలి. ఇదే ప్రత్యామ్నాయ అజెండాగా జాతీయ రాజకీయాలలో క్రియాశీలకపాత్ర పోషించబోతోంది. అత్యంత అభ్యుదయకర, ప్రగతిశీల ఎజెండా దేశాభివృద్ధికి రూపుదిద్దుకోనుంది. భారతదేశం సంపన్న దేశంగా, సౌభాగ్యవంతంగా కానుంది.


తెలంగాణ రాష్ట్రం వినూత్న పథకాలతో ఇతర రాష్ట్రాలన్నిటికీ ఒక ఆదర్శవంతమైన రోల్ మోడలుగా నిలిచింది. ఎంతోమంది వీటిని తమ రాష్ట్రాలలో కూడా అమలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. తెలంగాణ పథకాలైన రైతుకు ఎకరానికి రూ.10,000 పెట్టుబడి మద్దతు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, సార్వజనీన ఆమోదయోగ్య వ్యవసాయ విధానం. రైతుకు కనీస మద్దతు ధర, ఆదాయపు పన్నులో సౌలభ్యం, నల్లదనాన్ని వెలికి తీయడం ద్వారా నిధులను సమీకరించటం, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పార్లమెంట్ ఆధిక్యత, దేశంలో లభ్యమవుతున్న 70000 టీఎంసిల నీటి సద్వినియోగం, ఎన్నికల సంస్కరణలు, అధికారస్వామ్య సంస్కరణలు... ఇంకా మరెన్నో ప్రజోపయోగ విధానాలు జాతీయ ప్రత్యామ్నాయ అజెండాలో భాగం కావాలి. ఇవన్నీ జరగాలంటే అసలు సిసలైన ప్రత్యామ్నాయ జాతీయ నాయకత్వం  రావాలి. రాబోయే ఎన్నికలనాటికి అలా జరుగుతుందని ఆశిద్దాం.

వనం జ్వాలా నరసింహారావు

Read more