రైళ్లలో ఇకపై చిన్నారుల కోసం బెర్త్లు!
ABN , First Publish Date - 2022-05-11T08:03:43+05:30 IST
రైళ్లలో చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు పడుకోవడానికి తగినంత స్థలం ఉండకపోవడమనేది సాధారణంగా ఎదురయ్యే అతి పెద్ద ఇబ్బంది.
ప్రయోగాత్మకంగా లఖ్నవూ మెయిల్లో అమలు
న్యూఢిల్లీ, మే 10: రైళ్లలో చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు పడుకోవడానికి తగినంత స్థలం ఉండకపోవడమనేది సాధారణంగా ఎదురయ్యే అతి పెద్ద ఇబ్బంది. దీన్ని ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ కొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చింది. రైళ్లలోని కిందబెర్తుల్లో అదనంగా ఒక చిన్నారి పట్టే అంత మరో బెర్త్ను జోడించింది. దీన్ని బేబీ బెర్త్గా వ్యవహరిస్తున్నారు. వెంట పిల్లలు లేనివారు వీటిని కింది వైపునకు మడిస్తే.. మునుపటి కింద బెర్త్ తరహాలోనే కనిపిస్తుంది. బేబీ బెర్త్ నుంచి పిల్లలు కిందపడిపోకుండా దానికి ఒకవైపున అడ్డును(స్టాపర్) ఏర్పాటు చేయడం విశేషం. ఈ విధానాన్ని లఖ్నవూ మెయిల్లో ప్రయోగాత్మకంగా రైల్వే అధికారులు అమలుచేశారు. ఇందులో ప్రయాణించిన వారి అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ఇతర రైళ్లలోనూ దీన్ని అమలు చేయనున్నారు.
ప్రస్తుతానికి ప్రయాణికుల నుంచి స్పందన సానుకూలంగా ఉందని ఉత్తర రైల్వే(ఎన్ఆర్) విభాగం తెలిపింది. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వినూత్న పరిష్కారాన్ని అమలు చేశామని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను రైల్వే శాఖ ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా.. బేబీ బెర్త్ కలిగిన లోయర్ బెర్త్ కావాలంటే టికెట్ రిజర్వేషన్ సమయంలో సీనియర్ సిటిజన్ల గురించి పేర్కొన్న తరహాలో చిన్నారులతో ప్రయాణిస్తున్నామని పేర్కొనేలా, లభ్యతను బట్టి వారికి దీన్ని కేటాయించేలా ఏర్పాటు ఉంటుందని అధికారులు వివరించారు. అయితే.. ఇందుకు అదనంగా ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలోనే ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో అమలవుతుందని తెలిపారు. ఇక.. రైళ్లలో రాత్రి వేళలో ఫోన్లో గట్టిగా మాట్లాడటం, ఫోన్లో పాటల్ని వినిపించడాన్ని నిషేధించామని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా నిబంధనల్ని అతిక్రమించారని ఫిర్యాదులు వస్తే.. ఆ రైలులోని సిబ్బందిపై చర్యల్ని తీసుకుంటామని తేల్చిచెప్పింది.