HYD : అబ్రకదబ్ర.. ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్త.. నమ్మారో నట్టేట ముంచేస్తారంతే..!
ABN , First Publish Date - 2022-05-06T15:13:21+05:30 IST
అబ్రకదబ్ర.. ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్త.. నమ్మారో నట్టేట ముంచేస్తారంతే..!
- రూ. 11 లక్షలు హాంఫట్
- అతీంద్రియ శక్తులతో డబ్బు
- విలువ పెంచుతామని మోసం
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్ : అతీంద్రియ శక్తులతో తక్కువ మొత్తాన్ని ఎక్కువ చేస్తామని నమ్మించిన ఓ ముఠా బాధితుల నుంచి రూ. 11 లక్షలు తీసుకొని ఉడాయించింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం కస్తూరి కాలనీకి చెందిన డి.శ్రీనివాస్రెడ్డి, మీర్పేట్ నందిహిల్స్కు చెందిన మహేశ్ స్నేహితులు. ఇటీవల మహేశ్ శ్రీనివాస్రెడ్డి వద్దకు వెళ్లాడు. పాతనగరంలో ఓ మహిళ అతీంద్రియ శక్తులతో డబ్బు విలువ పెంచుతుందని, రూ. 11 లక్షలు తీసుకెళ్తే ఆ సొమ్మును రూ. 5 కోట్లుగా మారుస్తుందని చెప్పాడు.
దాంతో శ్రీనివాస్రెడ్డి మరో ఏడుగురు స్నేహితులతో కలిసి రూ. 11 లక్షలు తీసుకుని పాత నగరానికి చెందిన రాజుతోపాటు వినోద్, మహ్మద్ఖాన్తో కలిసి ఈ నెల 1న హస్తినాపురంలో శ్రీనివాస్రెడ్డి సోదరుడికి చెందిన ఓ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్లారు. అక్కడికి వచ్చిన మహిళ పూజ మొదలుపెట్టి.. ముందుగా వారి వద్ద ఉన్న రూ. 5 వేలను రూ. 50 వేలుగా మార్చినట్లుగా నమ్మించింది. దాంతో బాధితులు తమ వద్ద ఉన్న రూ. 11 లక్షలు ఆమె చెప్పినట్టు పూజలో పెట్టారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేస్తుండగా 15 మంది గుర్తుతెలియని వ్యక్తులు రెండు వాహనాల్లో అక్కడికి వచ్చారు. పోలీసులమని వారిని బెదిరించి డబ్బు తీసుకొని మహిళతోసహా పారిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు రెండురోజుల తర్వాత మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.