Watch Video: 60 మంది మత్స్యకారులకు తృటిలో తప్పిన ప్రమాదం.. బోటు ఎలా తిరగబడిందో చూడండి..
ABN , First Publish Date - 2022-05-11T00:57:40+05:30 IST
చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న 60 మంది మత్స్యకారులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని..
గంజాం: Cyclone Asani తుఫాను ప్రభావంతో ఒడిశాలోని మల్కాన్గిరి, గజపతి, గంజాం, పూరీ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న 60 మంది మత్స్యకారులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా ఛత్రాపూర్ సమీపంలోని ఆర్యపల్లి సముద్ర తీరం దగ్గర జరిగింది.
సముద్రంలోకి దాదాపు 60 మంది మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లొస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో.. ఈ జాలర్లు ఉన్న బోటు ఒక్కసారిగా తిరగబడింది. తీరానికి సమీపంలోనే తిరగబడటంతో ఆ 60 మంది మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా.. Cyclone Asani ప్రభావం ఒడిశా కంటే కూడా ఎక్కువగా ఏపీపైనే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలోని తీర ప్రాంత జిల్లాలపై Cyclone Asani ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మే 11 ఉదయం 8.30 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. 40 నుంచి 50 kmph వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భువనేశ్వర్ వాతావరణ విభాగం కూడా అసని తుఫానుపై తాజాగా సమాచారం ఇచ్చింది. రానున్న 24 గంటల్లో తుఫాను బలహీనపడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒడిశాలోని మల్కాన్గిరి, గంజాం, గజపతి, పూరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మత్స్యకారులెవరూ మే 13 వరకూ చేపల వేటకు వెళ్లవద్దని IMD Bhubaneswar సూచించింది.