Congress : ప్రలోభాల్లోనూ ప్రభావం!
ABN, First Publish Date - 2022-11-07T04:04:25+05:30
బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. టీఆర్ఎస్.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మునుగోడులో ఈ రెండు పార్టీల కంటే అంగ, ఆర్థిక బలాల్లో వెనకబడిన కాంగ్రె్సకూ ఓట్లు బాగానే రావడం గమనార్హం.
మునుగోడులో డబ్బు పంచకున్నా 23 వేల ఓట్లు
హుజూరాబాద్తో పోలిస్తే కాంగ్రెస్కు ఊరటే!
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. టీఆర్ఎస్.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మునుగోడులో ఈ రెండు పార్టీల కంటే అంగ, ఆర్థిక బలాల్లో వెనకబడిన కాంగ్రె్సకూ ఓట్లు బాగానే రావడం గమనార్హం. టీఆర్ఎస్, బీజేపీ అన్ని రకాలుగా ఓటర్లను ఆకర్షించగా.. కాంగ్రెస్ మాత్రం ప్రచారాన్నే నమ్ముకుంది. అయినా కొంత మేరకు ప్రభావం చూపింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటనిచ్చే స్థాయిలో (23,906)నే ఓట్లు వచ్చాయి! వాస్తవానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్కు చాలా ముందుగానే కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, బీజేపీ తరఫున రాజగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బరిలో నిలవడంతో నియోజకవర్గంలో సీన్ మారిపోయింది. ఆ రెండు పార్టీలూ ఓటుకు రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రభావం ఆర్థికంగా బలహీనమైన కాంగ్రెస్ అభ్యర్థిపై పడింది. బీజేపీ, టీఆర్ఎ్సలు స్థానికంగా కాంగ్రెస్ నాయకులను భారీ సంఖ్యలో తమ పార్టీల్లోకి చేర్చుకోవడంతో క్షేత్రస్థాయిలో ఓటర్లకు, పార్టీకి మధ్య అగాథం ఏర్పడింది.
పారని సెంటిమెంట్..!
2014 ఎన్నికల్లో మునుగోడు సీటును కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించింది. దాన్ని వ్యతిరేకిస్తూ పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. టీడీపీతో పొత్తులో పోటీ చేసిన బీజేపీని, కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన సీపీఐని వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గి రాజగోపాల్రెడ్డికి సహకరించారు. పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె కావడంతో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఆమె పట్ల సానుభూతి ఉంది. దీనికి తోడు ఈ ఉప ఎన్నికలో ఏకైక మహిళా అభ్యర్థి కావడం, నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సెంటిమెంట్నే ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. పోలింగ్కు ముందు స్రవంతికి వెల్లువెత్తిన సానుభూతి, రేవంత్రెడ్డి విస్తృత ప్రచారాలతో పార్టీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని అంచనా వేసుకున్నారు. 30-35 వేల వరకు ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే సెంటిమెంట్ పనిచేయకపోవడంతో 23 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఆమె సాధించిన ఓట్ల (27441) కంటే ఈ ఓట్లు తక్కువ కావడం గమనార్హం. అయితే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ధన ప్రవాహం, అధికార దుర్వినియోగాల మధ్య తమ అభ్యర్థికి 23 వేల ఓట్లు రావడం తక్కువేం కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల (3014 ఓట్లు)తో పోలిస్తే ఇది పెద్ద ఊరటేనంటున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాన్ని సార్వత్రిక ఎన్నికలకు ముడి పెట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2022-11-07T04:04:25+05:30 IST