ఆ 15 లక్షలు స్మితా సబర్వాల్ కట్టాల్సిందే
ABN, First Publish Date - 2022-05-03T07:25:47+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అవుట్లుక్ మ్యాగజీన్పై పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షలను... స్మితా సబర్వాల్ నుంచి రికవరీ చేయాలని..
ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ సొమ్మా: హైకోర్టు
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అవుట్లుక్ మ్యాగజీన్పై పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షలను... స్మితా సబర్వాల్ నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. 2015 జూన్ 18న హైదరాబాద్లోని ‘ది పార్క్’ హోటల్లో డిజైనర్ అభిషేక్ దత్తా ఆధ్వర్యంలో ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన భర్తతో కలిసి ర్యాంప్ షో చేశారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ అవుట్లుక్ ఆంగ్ల వారపత్రిక 2015 జూలైలో ‘నో బోరింగ్ బాబు’ అనే శీర్షికన ఓ వ్యాసాన్ని, క్యారికేచర్ను ప్రచురించింది. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన నేపథ్యంలో అవుట్లుక్పై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు నిధులు విడుదల చేయాలని స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
కేసు దాఖలు చేసేందుకు ఫీజు, ఖర్చుల నిమిత్తం రూ.15లక్షలఉ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడాన్ని సవాల్ చేస్తూ... సదరు జీవోను కొట్టేయాలని వి.విద్యాసాగర్, కె.ఈశ్వర్రావు అనే వ్యక్తులతోపాటు అవుట్లుక్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున హైకోర్టులో మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై తాజాగా చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి ఽధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఓ కీలక ప్రశ్నను లేవనెత్తింది. ఒక వ్యక్తి తన పరువుకు భంగం కలిగిందని సివిల్ దావా దాఖలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వొచ్చా? ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో లేనప్పుడు జరిగిన ఘటన కారణంగా ఏర్పడిన వివాదానికి ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అఖిల భారత సర్వీసు అధికారులకు న్యాయ సహాయం చేయవచ్చన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అధికారిక విధుల్లో భాగంగా తలెత్తే వివాదాలకు మాత్రమే సహాయం చేయాలని స్పష్టంచేసింది. ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షల నిధులు ప్రజాప్రయోజనం కోసం మంజూరు చేసిన నిధుల కిందికి రావని స్పష్టంచేసింది. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తాన్ని 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాలని.. లేనిపక్షంలో గడువు తీరిన 30 రోజుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆమె నుంచి సదరు మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది.