సాగుకు సమాయత్తం
ABN, First Publish Date - 2022-05-10T05:58:12+05:30
సాగుకు సమాయత్తం
- వానాకాలానికి ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు
- సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే పెరిగే అవకాశం
వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వికారాబాద్ జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరగనుంది. దీంతో రైతులకు విత్తనాలు, ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయనే దానిపై కార్యాచరణ రూపొందించారు. వానాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఏ పంట విత్తనాలు ఎంత మేర అవసరమవుతాయనేది అధికారులు అంచనా వేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు
వికారాబాద్, ఏప్రిల్25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్ జిల్లాలో గతఏడాది వానా కాలం సీజన్లో 5,35,834.21 ఎకరాల్లో 2,39,926 మంది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయగా, ఈ సారి వానాకాలం సీజన్లో సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. గత ఏడాది వానాకాలంలో సాగు చేసిన పత్తి, కంది పంటల విస్తీర్ణం కంటే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది ఏడాది వానాకాలంలో పత్తి పంట 1,76,746 ఎకరాల్లో సాగైతే.. ఈసారి 1,91,283 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. కంది పంట గతఏడాది 1,61,173.39 ఎకరాల్లో సాగవగా, ఈసారి 1.77 లక్షల ఎకరాలకు సాగు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. గత ఏడాది 62,795.35 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఈసారి 69,680 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జొన్న 2,257.39 ఎకరాల్లో పండించగా, ఈసారి 2,504 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. వరి 1,02,040.31 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,12,537 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా భావిస్తున్నారు. మినుములు
గత ఏడాది 9156.10 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 9305 ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా వేశారు. పెసర గత ఏడాది 14,683.30 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 15,316 సాగు కావచ్చని భావిస్తున్నారు.
సాగు ప్రారంభించక ముందే విత్తనాలు!
వానాకాలం సాగుకు ప్రధాన పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏ పంట విత్తనాలు ఎంత మేర అవసరమవుతాయనేది అధికారులు అంచనా వేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. పత్తి విత్తనాలు 3,82,565 ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. కందివిత్తనాలు 7,080 క్వింటాళ్లు, మొక్కజొన్న 3,484 క్వింటాళ్లు, జొన్న 130 క్వింటాళ్లు, వరి 28,135 క్వింటాళ్లు, మినుములు 375 క్వింటాళ్లు, పెసర 412 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. వానాకాలంలో పంటల సాగు ప్రారంభించే సమయం కంటే ముందే మార్కెట్లో రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉండేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పెరగనున్న ఎరువుల వినియోగం
పంటల సాగుకు ఎంతో ముఖ్యమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది వానాకాలం సీజన్లో రైతులు 83 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈసారి 1,06,052 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. యూరియా 43,229 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,615 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) 9,248 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 28,732 మెట్రిక్ టన్నులు, ఎస్ఎ్సపీ 8,978 మెట్రిక్ టన్నులు, కంపోస్టు 250 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వానాకాలం సాగు ప్రారంభమయ్యే నాటికి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఏడాది సాగు విస్తీర్ణం 6,00,000
ఈ ఏడాది అవసరమయ్యే ఎరువులు 1,06,052
గత ఏడాది సరఫరా చేసిన ఎరువులు ( మెట్రిక్ టన్నులు) 83,000
గత ఏడాది సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 5,35,834.21