పీఅండ్జీ పరిశ్రమను విస్తరించి ఉద్యోగాలు కల్పించండి: కేటీఆర్
ABN , First Publish Date - 2022-05-03T00:27:33+05:30 IST
పీఅండ్జీ పరిశ్రమను విస్తరించి ఉద్యోగ అవకాశాలు పెంచాలని మంత్రి కేటీఆర్ పరిశ్రమ అధికారులను కోరారు.

కొత్తూర్: పీఅండ్జీ పరిశ్రమను విస్తరించి ఉద్యోగ అవకాశాలు పెంచాలని మంత్రి కేటీఆర్ పరిశ్రమ అధికారులను కోరారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల పరిధిలోని పెంజర్ల గ్రామ శివారులో గల పీఅండ్జీ (బహుళజాతి పరిశ్రమ)లో రూ.200కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన డిటర్జెంట్ లిక్విడ్ ప్లాంట్ను సోమవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పీఅండ్జీ పరిశ్రమకు గతంలో 170ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం 35శాతం భూమిలో పరిశ్రమ విస్తరించి ఉందని, వందశాతం భూమిలో పరిశ్రమను విస్తరించి స్థానిక యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని పరిశ్రమ అధికారులను కోరారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తామన్నారు. రానున్నా రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ ప్రజలకు అధికంగా వినియోగంలోకి రానుందన్నారు. పీఅండ్జీ పరిశ్రమ డిజర్జెంట్ లిక్విడ్ ఉత్పత్తి చేయడం సంతోషకరమన్నారు.