Revanth Reddy : రేవంత్‌కు కలిసిరాని సీనియర్లు

ABN , First Publish Date - 2022-11-07T04:09:36+05:30 IST

తెలంగాణ కాంగ్రె్‌సలో ప్రజాకర్షక నాయకుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం.. రేవంత్‌రెడ్డి. ఈ ప్రజాకర్షణే ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ..

Revanth Reddy : రేవంత్‌కు కలిసిరాని సీనియర్లు
Revanth reddy

పీసీసీ చీఫ్‌కు ప్రజాకర్షణ ఉన్నా ఇతర నేతలు దూరం

శ్రేణులు పూర్తిగా అనుకూలం.. నాయకులే మోకాలడ్డు

ఎన్నికలకు 10 నెలలే.. విభేదాలు వీడకుంటే ఇక అంతే

కర్ణాటకలో భిన్నంగా పీసీసీ.. దూకుడుగా బీజేపీతో ఢీ

అక్కడ అధికారానికి చేరువ.. తెలంగాణలో ఇంకా వెనక్కు

కొరవడిన ఉద్యమ స్ఫూర్తి.. తీరు మార్చుకోకుంటే కష్టమే!

హైదరాబాద్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రె్‌సలో ప్రజాకర్షక నాయకుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం.. రేవంత్‌రెడ్డి. ఈ ప్రజాకర్షణే ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చిపెట్టింది. పార్టీకి పునరుజ్జీవం అందించే బాధ్యతను అధిష్ఠానం అప్పగించింది. దీనికితగ్గట్లే.. వరుస ఓటములతో డీలా పడిన శ్రేణులను రేవంత్‌ తన వాగ్ధాటితో ఉత్తేజం చేశారు. రాష్ట్ర స్థాయి అంశాలపై అధికార టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ మీద ఎదరుదాడికి దిగుతూ, జిల్లాల్లో పర్యటనలు చేస్తూ, పార్టీ పుంజుకునేలా చేశారు. బలమైన నాయకుడు వచ్చాడని క్యాడర్‌ భావిస్తూ.. పూర్తిగా రేవంత్‌ వెంట నడుస్తున్న తరుణంలో.. సీనియర్ల సహాయ నిరాకరణ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తోంది. రేవంత్‌ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ.. కేడర్‌ను కదిలిస్తూ శక్తిమేర పోరాడుతున్నా.. అంతర్గత కలహాలు పార్టీని వెనక్కు గుంజుతున్నాయి.

ఎన్నికలు ఎంతో దూరంలో లేకున్నా..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మహా అంటే పదినెలల సమయమే ఉంది. బలమైన ప్రత్యర్థులపై పోరాటానికి ఓ ప్రతిపక్షం కాలూచేయీ కూడదీసుకునేందుకు ఇది చాలా తక్కువ సమయం. పైగా కాంగ్రెస్‌ కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి.. కర్ణాటక మినహా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కొంచెమైనా ఆశతో చెప్పగల రాష్ట్రాలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే స్థానిక సమస్యలపై ఉద్యమాలు, వర్గ విభేదాలు వీడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడితేనే కాంగ్రె్‌సను రాష్ట్రంలో అధికారం రేసులో నిలపగలవు. అప్పుడే.. బీజేపీని తోసిరాజని టీఆర్‌ఎ్‌సకు బలమైన ప్రత్యామ్నాయంగానూ భావించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో రెండు పార్టీలే ప్రధానంగా ఉండి.. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధానంగా ఆ పార్టీని గెలిపిస్తూ ఉండేది. ఇప్పుడు బీజేపీ కూడా తెరపైకి వచ్చినందున కాంగ్రె్‌స నేతలు తీరు మార్చుకోకుంటే కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు గత లోక్‌సభ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్‌, తాజాగా మునుగోడుల్లో కాంగ్రె్‌సపై పైచేయి సాధించిన బీజేపీ ప్రత్యామ్నాయ రేసులో సవాలు విసురుతోంది. హుజూరాబాద్‌, మునుగోడుల్లో బీజేపీ సంప్రదాయ ఓటింగ్‌.. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులే టీఆర్‌ఎ్‌సకు ప్రధాన పోటీ దారులుగా నిలవడంతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకూ భారీగా బీజేపీకి బదిలీ అయింది.

నియోజకవర్గ పర్యటనలపైనా అభ్యంతరాలే

కేడర్‌ ఉత్సాహంగా ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ తలపెట్టిన నియోజకవర్గ పర్యటనలనూ కొందరు నాయకులు తప్పుబట్టిన పరిస్థితి. తమ అనుమతి లేకుండానే రావడం ఏమిటంటూ విమర్శలకు కూడా దిగారు. నాయకుల ఈ తీరు కాంగ్రె్‌సను బలహీనం చేస్తోంది. వాస్తవానికి మెజార్టీ డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతల ఆమోదంతో రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆయన ఏ సభకు వెళ్లినా కార్యకర్తల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది. అయితే కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు ఇస్తుండడంతో సీనియర్‌ నేతల్లో అసంతృప్తి, అసమ్మతి రాజుకుంది. సీనియర్లు వీహెచ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు రేవంత్‌పై బాహాటంగానే విమర్శలూ చేశారు. అభ్యంతరాలను అంతర్గత సమావేశాల్లో చెప్పాలని, మీడియా ముందు మాట్లాడవద్దంటూ అధిష్ఠానం హెచ్చరించడంతో.. అసంతృప్త నేతలు కొంత తగ్గారు.

ముందుంది మరింత కష్ట కాలం..?

నేతల మధ్య ఐక్యత లేకపోవడమనే సంస్కృతి, ఉప ఎన్నికల్లో ఓటముల పరంపర సహా పార్టీలో మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎదుర్కొన్న అసంతృప్తులు, అసమ్మతులే రేవంత్‌రెడ్డీ ఎదుర్కొంటున్నారు. రేవంత్‌ వచ్చాక.. హుజూరాబాద్‌, మునుగోడుల్లో పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. దీంతో అధ్యక్షుడు మారినా.. పార్టీ గతి మారలేదన్న ఆవేదన కాంగ్రెస్‌ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో పార్టీ పునరుజ్జీవం కోసం రేవంత్‌రెడ్డి ప్రజాకర్షణకు తోడుగా వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బృందాన్నీ అధిష్ఠానం దింపింది. కానీ, రేవంత్‌ విస్తృత ప్రచారం, సునీల్‌ వ్యూహం మునుగోడులో కాంగ్రెస్‌ను ప్రధాన పోటీదారుగా నిలపలేకపోయాయి. ఇక్కడ బీజేపీ ఓటమిపాలైనా కేవలం పది వేల ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలవడం కాంగ్రె్‌సకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలను బట్టి టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సలో ఏదో ఒకదానిని ఎంచుకునేందుకు వివిధ పార్టీల్లోని నేతలు వేచి చూస్తున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీని ఢీ కొట్టగలిగే బలమైన నేతను పార్టీలోకి తీసుకుంటే అక్కడి కాంగ్రెస్‌ ఓటర్లూ బీజేపీకి బదిలీ అయ్యే అవకాశం ఉందని హుజూరాబాద్‌, మునుగోడు నిరూపించాయి. ఇదే ఫార్ములాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు బీజేపీ పూనుకుంటే కాంగ్రెస్‌ పెద్ద సవాల్‌నే ఎదుర్కొనాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ రేసులో బీజేపీ దూసుకు వస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి కఠిన కాలం ఎదురవనుంది.

కర్ణాటక దూకుడు ఇక్కడేది?

పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ మంచి దూకుడు మీద ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే చాన్సూ కనిపిస్తోంది. అధికార బీజేపీకి ప్రధాన పోటీ దారుగా ఉండడం, ఆ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం కలిసి వస్తోంది. ఈ అనుకూల వాతావరణానికి తోడుగా ప్రజా సమస్యలపైన పార్టీ కలిసికట్టుగా పోరాడుతూ వస్తోంది. ఆ స్ఫూర్తి తెలంగాణ కాంగ్రె్‌సలో కొరవడింది. అధిష్ఠానం సూచించిన కార్యక్రమాలూ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవడం లేదు. కాగా, కర్ణాటకలో అధికారంలోకి వస్తే.. తెలంగాణలో పార్టీకి కొంత సహాయంగా ఉంటుందన్న ఆశ కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది.

వామపక్షాలు, ఎంఐఎంతోనే టీఆర్‌ఎస్‌.. మరి కాంగ్రెస్‌?

గత 8 ఏళ్లుగా వామపక్షాలను దూరం పెట్టిన సీఎం కేసీఆర్‌.. మునుగోడు ఉప ఎన్నికలో వారితో పొత్తు పెట్టుకుని కొత్త సమీకరణాలకు తెర తీశారు. వామపక్షాలు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎ్‌సతో వెళ్లే అవకాశం ఉంది. ఇక ఎంఐఎంతో టీఆర్‌ఎ్‌సకు అవగాహన కొనసాగుతోంది. ఈ పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికలను సీఎం కేసీఆర్‌ ఎదుర్కొనే ఆస్కారం ఉందంటున్నారు. టీఆర్‌ఎ్‌సతో పొత్తు ప్రసక్తే లేదంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేసిన నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మునుగోడులో నాలుగో స్థానంలో నిలిచిన బీఎస్పీతో అవగాహన పెట్టుకోనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాంగ్రెస్‌ పట్ల ఎస్సీల్లో సానుకూలత ఉంది. బీఎస్పీతో అవగాహనకు రావడం ద్వారా వారి ఓటు బ్యాంకును స్థిరీకరించుకునే ఆలోచనను కొందరు నేతలు చేస్తున్నారు

Updated Date - 2022-11-07T12:49:03+05:30 IST

Read more