ఈనెల 20న గృహప్రవేశానికి ముహూర్తం.. ఇంతలోనే అనంతలోకాలకు..!
ABN, First Publish Date - 2022-05-06T18:31:14+05:30
గురువారం సాయంత్రం 7 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు...
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : నాలుగంతస్తుల భవనంపై నుంచి పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. నల్లగొండ టౌన్ శివాజీనగర్ ప్రాంతానికి చెందిన ఉప్పల శ్రీధర్(42) సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య సునీత, కుమారుడు మనో విరాజ్(16), పునర్ణవా(13)తో కలిసి ఉప్పర్పల్లిలో నాలుగంతస్తుల భవనంలో అద్దెకు ఉంటున్నారు. బండ్లగూడ సన్సిటీలో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నాడు. ఈనెల 20న గృహప్రవేశం ఉంది. శ్రీధర్కు బీపీ ఉంది. చికిత్స పొందుతున్నాడు. గురువారం సాయంత్రం 7 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫోన్ రాగా టెర్రస్పైకి వెళ్లి మాట్లాడుతూ కిందపడిపోయి మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కూకట్పల్లిలో కార్మికుడు..
మూసాపేట గూడ్స్షెడ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన కొల్లి ఢిల్లీశ్వరరావు(40) మూసాపేటలో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం మూసాపేట గూడ్స్షెడ్ రోడ్డులో ఓ భవనంలో పనులకు వెళ్లాడు. ఐదో అంతస్తులో గోవా కర్ర కడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.