Dharani portal రద్దు చేస్తాం: రేవంత్రెడ్డి
ABN, First Publish Date - 2022-05-07T01:06:40+05:30
తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు.
వరంగల్: తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతు సంఘర్షణ సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు సాయం అందిస్తామని, భూమి లేని రైతులకు ఏడాదికి రూ.12 వేలు సాయం అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం అమలుచేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. పంటల బీమా అమలుచేసి నష్టపరిహారం వెంటనే అందిస్తామని, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
‘‘నకిలీ విత్తనాల నియంత్రణ కఠినచట్టం తెస్తాం. వరి కనీస మద్దతు ధర రూ.2,500 ఇస్తాం. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,200 ఇస్తాం. పత్తి మద్దతు ధర రూ.6.500 ఇస్తాం. మిర్చి మద్దతు ధర రూ.15 వేలు ఇస్తాం. రైతును రాజును చేయటమే మా లక్ష్యం’’ అని రేవంత్రెడ్డి ప్రకటించారు.