Virat Kohli: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా విరాట్ కోహ్లీ
ABN , First Publish Date - 2022-11-07T17:23:15+05:30 IST
కెరియర్లో తొలిసారి నామినేట్ అయిన కోహ్లీ ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ అవార్డు రేసులో
మెల్బోర్న్: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (virat kohli) అక్టోబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (ICC Player of Month Award for October)ను గెలుచుకున్నాడు. కెరియర్లో తొలిసారి నామినేట్ అయిన కోహ్లీ ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ అవార్డు రేసులో ఉన్న దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజాలను కోహ్లీ వెనక్కి నెట్టేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో కోహ్లీ బ్యాట్తో వీరవిహారం చేస్తున్నాడు. అక్టోబరులో నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 150 స్ట్రైక్ రేట్తో 205 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అక్టోబరు 23న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు. కోహ్లీ కెరియర్లోనే అది అత్యుత్తమంగా నిలిచిపోయింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రావడంపై కోహ్లీ మాట్లాడుతూ.. ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్యానల్ తనను అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేయడం తనకు మరింత ప్రత్యేకమని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ అవార్డు కోసం తనతోపాటు నామినేట్ అయిన ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడినట్టు తెలిపాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఇన్నింగ్స్ ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. పొట్టి ఫార్మాట్లోనే అది అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా రికార్డులకెక్కింది.
Read more

