శస్త్రచికిత్స చేసి ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చిన ఘటన గుర్తుందా..? 2 నెలల తర్వాత అనూహ్య పరిణామం..!
ABN, First Publish Date - 2022-05-06T17:57:23+05:30
ప్రపంచ వైద్య చరిత్రలోనే 2022 జనవరి 7న ఓ అద్భుత ఘట్టం ఆవిష్క్రతమైంది.
న్యూయార్క్: ప్రపంచ వైద్య చరిత్రలోనే 2022 జనవరి 7న ఓ అద్భుత ఘట్టం ఆవిష్క్రతమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ వైద్యులు తొలిసారిగా ఒక వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మెడికల్ సెంటర్లోని కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బార్ట్లే గ్రిఫిత్ నేతృత్వంలోని వైద్యుల బృందం 7 గంటల పాటు శ్రమించి డేవిడ్ బెన్నెట్(57) అనే హృద్రోగికి పంది గుండెను అమర్చారు. జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను బెన్నెట్కు అమర్చడం జరిగింది. ఆపరేషన్ తరువాత మామూలు మనిషి గుండెలాగే.. అది పనిచేస్తోందని, అది చూసి తాము థ్రిల్ అయ్యామని ఆపరేషన్ చేసిన డాక్టర్ గ్రిఫిత్ అన్నారు. అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా ఈ ఆపరేషన్ను అందరూ భావించారు. అయితే, ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజుల తర్వాత నుంచి ఉన్నట్టుండి బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. రెండు నెలల తర్వాత మార్చి 8న అతడు మృతి చెందాడు. కానీ, ఆ సమయంలో బెన్నెట్ మృతికి కచ్చితమైన కారణాన్ని వైద్యులు వెల్లడించలేదు.
ఆ తర్వాత అసలేం జరిగింది? బెన్నెట్ మరణానికి కారణం ఏంటనే విషయమై యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ వైద్యులు పరిశోధనలు మొదలెట్టారు. ఈ క్రమంలో వారికి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. తాజాగా వాటిని బయటకు తెలియజేశారు. పంది గుండెలో వైరల్ డీఎన్ఏ ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వారు పేర్కొన్నారు. దీని కారణంగా పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని ముందే గుర్తించలేకపోయామని తెలిపారు. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయని ఈ సందర్భంగా వైద్యులు అన్నారు. పైగా ఆ వైరస్ బారిన పడకుండా ఉండేలా బెన్నెట్కు అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా అతనికి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను సైతం అందించామన్నారు. అయినా వైరస్ ఇన్ఫెక్షన్కు బెన్నెట్ గురికావడంతో అతనికి అమర్చిన గుండె ఉబ్బడం మొదలైంది. ఆ తర్వాత కొద్దిరోజులకే గుండెలో ఒకరకమైన ద్రవం చేరడంతో దాని పనితీరులో మార్పు చోటు చేసుకుని మార్చి 8న బెన్నెట్ కన్నుమూశాడు. అయితే, ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో మాత్రం వైద్య బృందం స్పష్టంగా చెప్పలేకపోయింది.