ఈ ఒక్కడిపై 36 జిల్లాల్లో కేసు పెట్టిన 113 మంది మహిళలు.. అతను ఏం చేశాడో తెలిస్తే..
ABN, First Publish Date - 2022-05-08T20:26:03+05:30
పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రవీంద్ర కుమార్ మౌర్య.. వయసు 45 సంవత్సరాలు..
పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రవీంద్ర కుమార్ మౌర్య.. వయసు 45 సంవత్సరాలు.. వాటర్ పంప్ మెకానిక్ గా పని చేస్తుంటాడు.. ఇతను కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్ లో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. యూపీలోని 36 జిల్లాలకు చెందిన 113 మంది మహిళలు అతడిపై కేసులు పెట్టారు.. దీంతో పోలీసులు ఎంతో కష్టపడి అతడిని అరెస్ట్ చేశారు.. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే.. తనకు పరిచయం కూడా లేని మహిళలకు ఫోన్లు చేసి వారితో అసభ్యకరంగా మాట్లాడడం, వీడియో కాల్స్ చేసి అసభ్యకర పనులు చేయడం. దీంతో బాధిత మహిళలందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖాళీగా ఉన్న సమయంలో రవీంద్ర తన ఫోన్ నుంచి ఏదో ఒక నెంబర్ కు ఫోన్ చేస్తాడు. అవతల వైపు మహిళలు ఫోన్ లిఫ్ట్ చేస్తే తన ప్రతాపం చూపిస్తాడు. వారితో బూతులు మాట్లాడతాడు. వీడియో కాల్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. ఇలా యూపీలోని ఉన్నావో, కాన్పూర్, ప్రతాప్ గఢ్, ప్రయోగ్ రాజ్, రాయ్ బరేలీ, సుల్తాన్ పూర్, మీర్జా పూర్, గోరక్ పూర్, అమేథీ, ఘాజీపూర్ తో పాటు ఇతర జిల్లాలకు చెందిన మహిళలకు కూడా రవీంద్ర ఫోన్లు చేసి వేధించాడు. దీంతో వారందరూ రవీంద్రపై కేసులు పెట్టారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రవీంద్రను పట్టుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే రవీంద్ర తరచుగా తన ఫోన్ నెంబర్లను మార్చేసేవాడు.
ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ లు తీసుకుని వాడేవాడు. దీంతో అతడిని ట్రేస్ చెయ్యడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే ఫిర్యాదు చేసిన మహిళలందరికీ కౌశంబీ ప్రాంతం నుంచి కాల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి రవీంద్ర ఆచూకీ తెలుసుకున్నారు. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 45 సంవత్సరాల రవీంద్రకు, అతని నలుగురు సోదరులకు వివాహాలు కాలేదు. ఆ అసహనం వల్లే మహిళలతో రవీంద్ర అలా ప్రవర్తించాడని పోలీసులు భావిస్తున్నారు.