వందల ఏళ్ల ఆచారానికి పులుస్టాప్.. ఇకపై ఈ గ్రామంలో భర్త చనిపోయినా స్త్రీలు మంగళసూత్రం, బొట్టు తీయనక్కర్లేదట..!
ABN, First Publish Date - 2022-05-13T22:35:20+05:30
భర్తను కోల్పోయిన స్త్రీలు మంగళసూత్రం, గాజులు, బొట్టు తీసేసి వితంతులుగా మారుతుంటారు. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం హిందూ మతంలో కొనసాగుతుంది. అయితే ఈ ఆచారానికి ఓ గ్రామం పుల్స్టాప్ పె
ఇంటర్నెట్ డెస్క్: భర్తను కోల్పోయిన స్త్రీలు మంగళసూత్రం, గాజులు, బొట్టు తీసేసి వితంతులుగా మారుతుంటారు. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం హిందూ మతంలో కొనసాగుతుంది. అయితే ఈ ఆచారానికి ఓ గ్రామం పుల్స్టాప్ పెట్టింది. భర్త కోల్పోయిన స్త్రీ తన మంగళసూత్రం, గాజులు, బొట్టు తీయనక్కర్లేదు అని తీర్మానం చేసింది. ఇకపై ఈ ఆచారం తమ గ్రామంలో కొనసాగదని స్పష్టం చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రకు చెందిన రాజ రాజర్షి ఛత్రపతి సాహు మహరాజ్.. ఒక సంఘ సంస్కర్త. ఎన్నో దురాచారాలపై పోరాటం చేశారు. కొల్హాపూర్ జిల్లాలో ఈయన గురించి తెలియని వారుండరు. కాగా.. రాజ రాజర్షి ఛత్రపతి సాహు మహరాజ్ 100వ వర్ధంతి సందర్భంగా హెర్వాడ్ (Herwad) గ్రామ సర్పంచ్ సుర్గొండ పాటిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భర్తలను కోల్పోయిన గ్రామ మహిళలు ఇకపై మంగళసూత్రం, గాజులు, బొట్టు, పూలు తీయాల్సిన అవసరం లేదనే తీర్మానాన్ని ఆమోదించారు.
Herwad గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం పట్ల మహాత్మ ఫూలే సమాజ్ సేవా మండల్ (Mahatma Phule Samaj Seva Mandal) అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తన సహోద్యోగులు చాలా మంది చనిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తమ భార్యల నుంచి బొట్టు, మంగళసూత్రం, గాజులను బలవంతంగా తొలగించడాన్ని తాను గమనించినట్టు పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఈ విధానానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకుని హెర్వాడ్ గ్రామ ప్రజలను సంప్రదించినట్టు చెప్పారు. అక్కడి ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతించారని.. ఈ క్రమంలోనే ఏకంగా గ్రామం మొత్తం ఆ ఆచారానికి చరమగీతం పాడినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని బహిష్కిరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించినట్టు పేర్కొన్నారు.