ఒడిలో తమ్ముడిని నిద్రపుచ్చి క్లాస్రూమ్లో పాఠాలు విన్న ఈ బాలిక గుర్తుందా..? తాజాగా ఇప్పుడు..
ABN, First Publish Date - 2022-05-08T17:51:08+05:30
తల్లిలా బాధ్యత తీసుకుని, తమ్ముడిని ఒడిలో కూర్చొబెట్టుకుని శ్రద్ధగా పాఠాలు వింటున్న పదేళ్ల మణిపూర్ బాలిక ఫొటోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తల్లిలా బాధ్యత తీసుకుని, తమ్ముడిని ఒడిలో కూర్చొబెట్టుకుని శ్రద్ధగా పాఠాలు వింటున్న పదేళ్ల మణిపూర్ బాలిక ఫొటోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటో కారణంగా బాలిక మెనింగ్సిన్లియు పమేయ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. చివరకు ఈ ఫోటోలు మణిపూర్ రాష్ట్ర మంత్రికి చేరడంతో ఆయన ఆ చిన్నారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. పమేయ్ అంకితభావాన్ని మెచ్చుకున్న మణిపూర్ అటవీ-పర్యావరణ, వ్యవసాయ మంత్రి బిశ్వజీత్ థోంగమ్.. ఆ చిన్నారి చదువు బాధ్యతలను తీసుకున్నారు.
బాలికను రాజధాని ఇంఫాల్ తీసుకురావాలని, ఆమె కోసం బోర్డింగ్ స్కూల్ సిద్ధంగా ఉందని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పారు. అంతేకాదు, బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవరకు తానే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చిన్నారి చదువు కోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, బాలిక అంకితభావానికి గర్వపడుతున్నానని అన్నారు. బాలిక భవిష్యత్ ప్రయత్నాలకు మీరు కూడా అభినందనలు తెలిపాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంఫాల్లోని స్లొపెలాండ్ బోర్డింగ్ స్కూల్ లో ఆ బాలిక చదువుకోబోతోంది. మంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.