కండరాల పటుత్వం కోసం...
ABN, First Publish Date - 2022-05-10T05:30:00+05:30
కండరాల పటుత్వం కోసం...
యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఏ ఆసనంతో ఏ కండరాలకు వ్యాయామం అందుతుందో, ఎలాంటి ఫలం దక్కుతుందో తెలుసుకుందాం!
ప్రసరిత పాదోత్తనాసనం
రెండు కాళ్లూ, రెండు చేతులూ నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే....
వెన్ను సాగదీయబడుతుంది.
తొడలు, పిక్కలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి.
మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోళన, గందరగోళం, తలనొప్పులు, భుజాల్లో నొప్పులు తగ్గుతాయి.
ఈ ఆసనంతో నాడీ వ్యవస్థ స్వాంతన పొందుతుంది.
మరింత క్లిష్టమైన యోగాసనాలను సాధన చేసేందుకు వీలుగా ఈ ఆసనం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
అధోముఖ కపోతనాసనం
ఒక కాలును మడిచి, మరో కాలును వెనకగా చాపి కూర్చుని, శరీరాన్ని ముందుకు నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
వెనకకు వంగే ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
తుంటి, తొడ ఎముకలు కలిసే కీలును బలపరుస్తుంది.
నడిచేటప్పుడు, పద్మాసనం వేసే సమయంలో, పరిగెత్తే సమయంలో, నిలబడినప్పుడు శరీరం మరింత తేలికగా కదిలేలా ఈ ఆసనం తోడ్పడుతుంది.
విపరీతకారిణి
నేల మీద వెల్లకిలా పడుకుని, గోడ మీద కాళ్లు నిటారుగా చాపి ఉంచే ఈ ఆసనంతో ఒరిగే ప్రయోజనాలు ఇవి...
ఈ ఆసనం వేసే సమయంలో నడుము అడుగున దుప్పటి ఉండలా చుట్టి ఉంచుకుంటే, కాళ్ల వాపులు, అలసిపోయే కీళ్లు, భారంగా మారే తుంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ ఆసనం వేయడం ద్వారా ఇలాంటి ఇబ్బందులకు కారణమయ్యే లింఫ్, ఇతర స్రావాలు ఆయా శరీర భాగాల నుంచి పొత్తికడుపులోకి చేరతాయి. ఫలితంగా కాళ్లు, పునరుత్పత్తి వ్యవస్థల్లోని ఇబ్బందులు తొలగుతాయి.