ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. Mobile Tower ఎక్కాక ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-05-11T00:24:53+05:30 IST
అలప్పూజ : ఆత్మహత్యాయత్నాలు బెడిసికొట్టిన వార్తలు అనేకం వినుంటారు. ఇదేతరహా మరో ఆసక్తికర ఘటన కేరళలో వెలుగుచూసింది.
అలప్పూజ : ఆత్మహత్యాయత్నాలు బెడిసికొట్టిన వార్తలు అనేకం వినుంటారు. ఇదేతరహా మరో ఆసక్తికర ఘటన కేరళలో వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. మొబైల్ టవర్ పైనుంచి దూకాలని భావించింది. అనుకున్నవిధంగానే బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కడం మొదలు పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని బతిమాలినా వారి మాటవినలేదు. టవర్ ఎక్కే ప్రయత్నం ఆపలేదు. దాదాపు టవర్ టాప్కు ఎక్కిన తర్వాత అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టవర్ ఎక్కే క్రమంలో టవర్ను అంటిపెట్టుకుని ఉన్న కందిరీగల తెట్టెను మహిళ తాకింది. దీంతో ఒక్కసారిగా కందిరీగల గుంపు ఆమెను చుట్టముట్టింది. కొన్ని కందిరీగలు కుట్టాయి కూడా. దీంతో బాధిత మహిళ బిగ్గరగా ఏడుస్తూ టవర్ దిగడం షురూ చేసింది. భయంతో పూర్తిగా దిగకముందే కొన్ని అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. అప్పటికే పోలీసు, ఫైర్ సిబ్బంది అమర్చిన వలలో పడడంతో ఆమెకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. మొత్తానికి కందిరీగలు ఓ మహిళ ప్రాణాలు నిలవడానికి కారణమయ్యాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఆత్మహత్యాయత్నానికి కారణం ఇదే..
కేరళలోని అలప్పూజలో సోమవారం ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ, తన భర్త మధ్య ఘర్షణ జరిగింది. వీరి బిడ్డను తండ్రి లాక్కున్నాడు. దీంతో మనస్థాపానికి గురయిన మహిళ.. బిడ్డను తనకు తిరిగిచ్చేయాలని పట్టుబట్టింది. ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయినా బిడ్డ వడిచేరకపోవడంతో టవర్ ఎక్కేసింది. ఈ మేరకు స్థానిక పోలీసులు సమాచారమిచ్చారు. కందిరీగల వెంటబడడంతోనే మహిళ కిందికి దిగిందని, లేకుంటే దిగే అవకాశంలేదని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు తమిళనాడుకు చెందిన మహిళ అని చెప్పారు. హాస్పిటల్లో చేర్చించామని, ఆమె పరిస్థితి స్థిరంగానే ఉందన్నారు. కాగా ఆమె భర్తను సంప్రదించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో బాధిత మహిళను సంప్రదించాలనుకునేవారి కోసం ఓ కాంటాక్ట్ నంబర్ను ఏర్పాటు చేశామని పంచుకున్నారు.