Bear Attack: ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి.. చిల్లింగ్ వీడియో ఇదిగో!
ABN, First Publish Date - 2022-11-07T11:52:59+05:30
ఓ ఎలుగుబంటి (bear) ముగ్గురిపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తమిళనాడు (tamil nadu)లోని టెంకాశి జిల్లాలో ఓ ఎలుగుబంటి (bear) ముగ్గురిపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరుథిలింగపురం గ్రామానికి చెందిన వైగుండమణి మసాలా పొట్లాలు తీసుకుని బైక్పై శివశైలం నుంచి పెథన్పిల్లై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వైగుండమణి దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో పక్కనే ఉన్న పొదల్లో నుంచి భల్లూకం ఒక్కసారిగా అతడిపైకి దూకి దాడిచేసింది.
వైగుండమణిని కింద పడేసిన ఎలుగు అతడిని ఇష్టం వచ్చినట్టు కొరికింది. గమనించిన ఆ దారిన వెళ్లేవారు, సమీప గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని గట్టిగా అరుస్తూ ఎలుగును వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అది వైగుండమణిని వదలకుండా కొరుకుతూనే ఉంది. ఆ తర్వాత దానిపైకి రాళ్లు విసరడంతో మణిని వదిలిపెట్టి వారిపైకి లంఘించి మరో ఇద్దరు.. నాగేంద్రన్, శైలేంద్రలపై దాడిచేసి పరారైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ ఎలుగుబంటిని బంధించారు. కాగా, బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2022-11-07T11:53:00+05:30 IST