Perambur: నెత్తురోడిన రహదారులు
ABN, First Publish Date - 2022-05-09T16:42:23+05:30
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. కృష్ణగిరిలో శనివారంరాత్రి సంభవించిన
రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం
చెన్నై/పెరంబూర్: రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. కృష్ణగిరిలో శనివారంరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందారు. రామనాథపురం జిల్లా మండపం జాతీయ రహదారిపై ఓ కారు, మోటార్సైకిల్ను ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఉమామహేశ్వరన్ (45), మునీశ్వరన్ (41), జగదీశ్వరన్ (19) ఒకే మోటార్సైకిల్పై మండపం నుంచి మరక్కాయపట్టణానికి బయల్దేరారు. మండపం జాతీయ రహదారిలో మేట్టుపాళయం నుంచి రామేశ్వరం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైకులో ప్రయాణించిన ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. అదే సమయంలో బైక్ను ఢీకొన్న కారు ఆగకుండా రోడ్డు పక్కనే రిటైర్డ్ ఎస్ఐ కృష్ణమూర్తిని ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కారు డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా, రిటైర్డ్ ఎస్ఐ కృష్ణమూర్తి ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్తుంటారు. అలా మండపం వంతెనపై వాకింగ్ వెళ్లిన సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
తిరుచ్చి సమీపంలో...
తిరుచ్చి సమీపంలో ఆదివారం వేకువజాము జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన 10 మంది సరుకుల ఆటోలో పుదుకోట జిల్లా విరాళిమలైలోని బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లారు. తిరుచ్చి-కల్లనై రోడ్డులో తిరువలర్సోలై మార్గంలో ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మి (58), సూర్య (29) అనే మహిళలు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి. కొల్లిడం టోల్గేట్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ధర్మపురి జిల్లాలో...
ధర్మపురి జిల్లా దిండల్పాడి ప్రాంతానికి చెందిన జయశంకర్ (58) కృష్ణగిరి జిల్లా కల్లాని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా రు. ఆయన రెండు రోజుల కిత్రం మోటార్సైకిల్లో దిండల్పట్టి నుంచి మొరపూర్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో మోటార్సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జయశంకర్ సేలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. అలాగే, కారిమంగళం సమీపం కుమారహళ్లి పంచాయతీ కాట్టూరుకు చెందిన రైతు పెరియస్వామి (52) శనివారం సాయంత్రం కృష్ణగిరి-ధర్మపురి జాతీయ రహదారిలోని మణికట్టియూర్ జంక్షన్ వద్ద వస్తూ కారు ఢీకొని ఘటనా స్థలంలోనే మృతిచెందాడు.