Missing girlపై పోలీసులకు గుజరాత్ హైకోర్టు అక్షింతలు

ABN , First Publish Date - 2022-05-06T21:25:53+05:30 IST

మూడేళ్లుగా కనిపించకుండా పోయిన బాలిక అచూకీ తెలుసుకోవడంలో..

Missing girlపై పోలీసులకు గుజరాత్ హైకోర్టు అక్షింతలు

అహ్మదాబాద్: మూడేళ్లుగా కనిపించకుండా పోయిన బాలిక అచూకీ తెలుసుకోవడంలో విఫలమైన పోలీసులపై Gujarat highcourt అక్షింతలు వేసింది. ఇది వ్యవస్థ భారీ వైఫల్యంగా పేర్కొంది. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అవసరమైన టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ను ఉపయోగించుకుని విచారణను ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది.


కేసు పూర్వాపరాల ప్రకారం, రాజ్‌కోట్‌కు చెందిన మైనర్ బాలిక 2019లో 30 ఏళ్ల యువకుడితో కలిసి పారిపోయింది. అప్పటికి బాలిక వయస్సు 15 ఏళ్ల లోపే. బాలిక తండ్రి తన లాయర్ నీరవ్ సాంఘవి ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ మూడేళ్లుగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ను హైకోర్టు రెండుసార్లు మార్చింది. ఆ తర్వాత కూడా బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోవంతో జస్టిస్ సోనియా గోకని, జస్టిస్ మౌన భట్‌లతో కూడిన ధర్మాసనం మండిపడింది. ''ఇది  పూర్తిగా వ్యవస్థ వైఫల్యమే. 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే బాలిక కనిపించకుండా పోయింది. ఒక వ్యవస్థగా మనం విఫల తల్లిదండ్రులం'' అని ఘాటుగా వ్యాఖ్యానించింది.


తొలుత రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్ పోలీస్ స్టేషన్ ఈ కేసును దర్యాప్తు చేసింది. కేసు విచారణ 2019 సెప్టెంబర్‌లో యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్‌కు బదిలీ అయింది. దర్యాప్తు నత్తనడకపై న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏళ్లు గడిచిపోయాయే కానీ  పోలీసులు చేసిందేమీ లేదని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రతి పోలీస్ సెల్ పనిచేసిందని గుర్తు చేశారు. బాలిక జాడ విషయంలో ఇన్వెస్టిగేటర్ (దర్యాప్తు సంస్థ)కు మరో 6 వారాలు గడువు ఇస్తున్నామని, ఈలోగా విచారణను పూర్తి చేసి బాలిక ఆచూకీతో పాటు, పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన వ్యక్తి (బాలికతో పరారైన వ్యక్తి) ఆచూకీ కనిపెట్టాలని న్యాయమూర్తులు ఆదేశించారు. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే 18 ఏళ్ల వయసుకు  బాలిక చేరువవుతున్నందున, ఆమెను తీసుకువెళ్లిన వ్యక్తి తనపై ఉన్న FIRను అంతతేలిగ్గా కొట్టివేయించుకునే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కూడా కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది.

Read more