ధర్మపురం ఆధీనం పట్టణ ప్రవేశానికి High court Green signal
ABN , First Publish Date - 2022-05-13T14:02:19+05:30 IST
మైలాడుదురైలో ధర్మపురం ఆధీనం పట్టణ ప్రవేశానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఉత్సవానికి భద్రత కల్పించాలని పోలీస్ శాఖను గురువారం ఆదేశించింది. దాంతో
- పోలీసుల భద్రత నడుమ ధ్వజారోహణం
ప్యారీస్(చెన్నై): మైలాడుదురైలో ధర్మపురం ఆధీనం పట్టణ ప్రవేశానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఉత్సవానికి భద్రత కల్పించాలని పోలీస్ శాఖను గురువారం ఆదేశించింది. దాంతో అక్కడ ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ధర్మపురం ఆధీనం పట్టణ ప్రవేశ వేడుకలను నిలుపుదల చేస్తూ మైలాడుదురై తహసీల్దార్ గత నెల ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆధీనం గురువులు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రవేశం వేడుకలకు రాష్ట్రప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఆ మేరకు ఈ నెల 22న మైలాడుదురైలో పట్టణ ప్రవేశ వేడుకలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా, పట్టణ ప్రవేశం వేడుకలు జరుపుకొనేందుకు అనుమతిస్తే శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే అవకాశముందని, ఇందుకు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ విల్లివాక్కంకు చెందిన రాజా శివప్రకాశం మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు స్వామినాధన్, సెంథిల్కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆధీనం పట్టణ ప్రవేశం కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలని పోలీసుశాఖను ఆదేశిస్తూ, ఈ కేసు ముగిస్తున్నట్లు వెల్లడించింది.