రూ.518 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి
ABN , First Publish Date - 2022-05-13T16:32:34+05:30 IST
జీసీసీ, చెన్నై మెట్రోవాటర్ అండ్ సీవరేజ్ బోర్డు, పురపాలక మంత్రిత్వ శాఖ, తమిళనాడు డ్రింకింగ్ వాటర్ బోర్డు తరపున రూ.518.17 కోట్లతో పూర్తి చేసిన వివిధ
- ప్రారంభించిన Cm stalin
అడయార్(చెన్నై): జీసీసీ, చెన్నై మెట్రోవాటర్ అండ్ సీవరేజ్ బోర్డు, పురపాలక మంత్రిత్వ శాఖ, తమిళనాడు డ్రింకింగ్ వాటర్ బోర్డు తరపున రూ.518.17 కోట్లతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా చెన్నై కార్పొరేషన్ తరపున కొట్టూరుపురం, వలసరవాక్కం ప్రాంతాల్లో నిర్మించిన పార్కులు, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్లను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత చెన్నై మెట్రోవాటర్ అండ్ సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో పూర్తి చేసిన పనులను, పురపాలక శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేసిన పనులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా చెన్నై కార్పొరేషన్, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, టౌన్ పంచాయతీ డైరెక్టరేట్ విభాగాల్లో పనిచేస్తూ అకాలమరణం చెందిన వారి వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఆయన అందజేశారు. అదేవిధంగా, కరోనా బారిన పడి మరణించిన 71 మంది పర్మినెంట్, కాంట్రాక్టు సిబ్బందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.16.55 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ముత్తుస్వామి, స్వామినాథన్, సెల్వరాజ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.