నగరంలో పెరుగుతున్న Covid కేసులు
ABN, First Publish Date - 2022-05-03T16:59:55+05:30
కొవిడ్ నాల్గోవేవ్ హెచ్చరికల నేపథ్యంలోనే రాజధానిలో కేసులు క్రమేపీ పెరుగుతుండటంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు అప్రమత్తమయ్యారు.
- మూడు కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
బెంగళూరు: కొవిడ్ నాల్గోవేవ్ హెచ్చరికల నేపథ్యంలోనే రాజధానిలో కేసులు క్రమేపీ పెరుగుతుండటంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు అధికంగా ఉన్న మహదేవపురం డివిజన్లోని రెండు ప్రాంతాలను, బెంగళూరు దక్షిణ డివిజన్లో ఒక ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. తాజాగా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న మూడు ప్రాంతాలను ఇలా కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఇలా గుర్తించిన ప్రాంతాలపై బీబీఎంపీ అధికారులు ప్రత్యేకంగా నిఘావేసి ఉంచుతారు. 14 రోజుల పాటు వైద్య సిబ్బంది ఈ ప్రాంతాలపై దృష్టిసారిస్తారు. జోన్లోని ప్రజల ఆరోగ్య స్థితిగతుల్ని ఎప్పటికపుడు సమీక్షిస్తుంటారు. కాగా కొవిడ్ పరీక్షలను సోమవారం నుంచి మరింతగా పెంచామని, ఇందు కోసం 500 మంది వైద్య సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంపై నియమించామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా వెల్లడించారు. ఆదివారం 10,500 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా సోమవారం ఈ సంఖ్యను 15వేలకు పెంచారు.