నాగార్జున వర్సిటీలో వైసీపీ జాబ్ మేళా...అడ్డుకునేందుకు తెలుగు యువత యత్నం
ABN, First Publish Date - 2022-05-07T15:35:27+05:30
గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ప్రైవేట్ సంస్థలలో 15వేల పోస్ట్లకు ఈరోజు, రేపు ఇంటర్వ్యూలు చేయనున్నారు.
విజయవాడ: గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ప్రైవేట్ సంస్థలలో 15వేల పోస్ట్లకు ఈరోజు, రేపు ఇంటర్వ్యూలు చేయనున్నారు. అయితే జాబ్ మేళా మేరుతో వైసీపీ నాయకులు యువతను మోసం చేస్తున్నారంటున్న తెలుగు యువత ఆరోపించింది. నాగార్జున యూనివర్శిటీకి బయలుదేరిన తెలుగు యువత ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదని తెలుగు యువత ప్రతినిధులు తెలిపారు. ముందస్తుగా అరెస్టు చేస్తున్నామంటూ నాగ శ్రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ.... జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.30లక్షల ఉద్యోగాలు భర్తి చేస్తామని ఘనంగా ప్రకటించారని గుర్తుచేశారు. నమ్మి ఓట్లు వేసిన యువతను ఇప్పుడు వీధులపాలు చేశారని మండిపడ్డారు. భరోసా, భద్రత లేని ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు తమరు ఇప్పించేదేమిటని ప్రశ్నించారు. బిటెక్, పిజీ చేసిన వాళ్లకి స్విగ్గి, జుమాటోల్లో ఉద్యోగాలా అని నిలదీశారు. జగన్ మోసాలు ప్రజలకు అర్ధమయ్యాయని అన్నారు. జాబ్ మేళా పేరుతో కొత్త మోసాలకు వైసీపీ నేతలు తెర లేపారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నాగ శ్రావణ్ డిమాండ్ చేశారు.