రాలిన మామిడి రైతుల ఆశలు
ABN, First Publish Date - 2022-05-07T05:56:24+05:30
ఆగిరిపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది.
ఈదురు గాలులు.. అకాల వర్షం
దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు
గంటల కొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆగిరిపల్లి, మే 6: ఆగిరిపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. సాయంత్రం 5.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 నిమిషాలు గాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు మామడి కాయలు నేలరాలాయి. కోసిన పంట కూడా వర్షానికి తడిసిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచి గ్రామాల్లో అంధకారం నెలకొంది.
కోళ్ల ఫారంపై కూలిన తాటిచెట్టు.. 500 కోళ్లు మృత్యువాత
కొమ్మూరులో శుక్రవారం ఈదురగాలుల బీభత్సానికి తాటిచెట్టు కూలి గ్రామానికి చెందిన జన్యావుల రాజశేఖర్ కోళ్లఫారంపై పడటంతో షెడ్డు పూర్తిగా ధ్వంసమై 500 కోళ్లు మృత్యువాతపడ్డాయి.
ముసునూరు: మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రమణక్కపేట, సూరేపల్లి, గోపవరం గ్రామాల్లో మామిడి నేలరాలింది. ముసునూరు, అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి తదితర గ్రామాల్లో గెల దశలో ఉన్న అరటితోటలు కొంతమేర నేలకొరిగాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చాట్రాయి: ఈదురుగాలులు, భారీ వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. కల్లాల మీద ఉన్న మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయింది. మండలంలో మామిడి కాపు ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడే కోతలు మొదలు పెడుతున్నారు. పంట చేతికి వచ్చే దశలో గాలివాన కోలుకోలేని దెబ్బ తీసిందని రైతులు వాపోయారు.
నూజివీడు టౌన్: నూజివీడు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షానికి మామిడి, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. కోతకు వచ్చిన మామిడి నేల రాలింది. రెండేళ్లుగా కరోనా కారణంగా నష్టపోయిన రైతు ఈ ఏడాది తామర పురుగు తాకిడితో పూత దశలోనే దిగుబడిపై ప్రభావం చూపింది. ఉన్న కొద్ది పాటి పంటతోనైనా పంట పెట్టుబడి వస్తుందనుకున్న క్రమంలో గాలివాన మామిడి రైతును దెబ్బతీసింది.