పర్యాటకాభివృద్ధి పనులు వేగవంతం
ABN, First Publish Date - 2022-11-08T00:29:08+05:30
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.
అధికారులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం
మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచన
పాడేరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, టూరిజం అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, చెరువులవేనం, కొత్తవలస, తాజంగి పర్యాటక ప్రాంతాల్లో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు త్వరగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. చెరువులవేనంలో స్టోన్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేసి రహదారి, మరుగుదొడ్ల నిర్మాణాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు పనులు వేగంగా జరగాలన్నారు. వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం వద్ద పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అరకులోయలోని గిరిజన మ్యూజియం షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలను కమిటీ అధ్యయనం చేసి నిర్ణయించిందన్నారు. షాపులు నిర్వహిస్తున్న యజమానుల నుంచి అద్దెల వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. షాపులు పొందిన యజమానులు వ్యాపారాలు ప్రారంభించకపోతే, వారికి నోటీసులిచ్చి కేటాయింపులు రద్దు చేస్తామన్నారు. తాజంగి రిజర్వాయర్పై జిప్లైనర్, బోటింగ్ ఆదాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్ ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్ఎం రాజు, డీఈఈ అనుదీప్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, గిరిజన మ్యూజియం మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-08T00:29:08+05:30 IST