వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా?: Anjaneyulu
ABN, First Publish Date - 2022-05-09T19:14:53+05:30
వినుకొండ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శలు గుప్పించారు.
పల్నాడు: వినుకొండ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే కౌన్సిలర్ భార్య ఓ మహిళను చెప్పుతో కొట్టడం దారుణమన్నారు. పోలీసులు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. వైసీపీ నేతలతో కలసి పోలీసులు స్టేషన్లలో పంచాయతీలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ ఏమైనా బ్రహ్మనాయుడు అబ్బ జాగీరా అని అన్నారు. ఏపి ఏమైనా జగన్ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల కొవ్వు తగ్గించడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘‘గడప గడపకు వస్తారా... రండి దమ్ముంటే... చీపుర్లలతో తరిమి కొడతారు. వైసీపీ దొంగల ముఠాను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ ఆంజనేయులు అన్నారు.