మంత్రి రజినీకి ఎందుకు అంత బాధ: Pulla Rao
ABN, First Publish Date - 2022-05-14T01:29:04+05:30
మంత్రి రజినీకి ఎందుకు అంత బాధ: Pulla Rao
చిలకలూరిపేట: అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంత్రి విడదల రజిని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని తాగునీటి చెరువుల వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో సుమారు రూ.7కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునఃప్రారంభోత్సవానికి వెళ్లిన పుల్లారావును పోలీసులు, మునిసిపల్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగింది. పోపూరి చందు అనే టీడీపీ కార్యకర్తతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పేదలకు అతితక్కువ ధరకు మినరల్ వాటర్ అందించాలనే ఉద్ధేశంతో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు పట్టణాలలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటుచిన ప్లాంటు మినహా మిగిలిన అన్ని ప్లాంట్లు నడుస్తున్నాయన్నారు. పేదలకు సురక్షితనీరు అందిస్తామంటే మంత్రి రజినీకి ఎందుకు అంత బాధ అని పుల్లారావు ప్రశ్నించారు.