రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయి: Chandrababu
ABN, First Publish Date - 2022-05-08T23:58:37+05:30
రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
చిత్తూరు: రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల వ్యవహారంపై తానొక్కడే మొనగాడని సీఎం జగన్ (CM Jagan) విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ (TRS) వామపక్షాలతో పొత్తులు పెట్టుకోలేదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలు ఇంకెంతో కాలం కొనసాగవని, ముగింపు పలకడానికి సమయం దగ్గరపడిందని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు మితిమీరాయని తెలిపారు. సదుంలో టీడీపీ నేత రాజారెడ్డిని వైసీపీ శ్రేణులు హతమార్చేందుకు యత్నించాయని, హత్యాయత్నంపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు జోస్యం చెప్పారు.