ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి Vidadala Rajini స్పందన
ABN, First Publish Date - 2022-05-11T19:46:07+05:30
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి ఘనటపై మంత్రి విడుదల రజిని స్పందించారు.
అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి ఘనటపై మంత్రి విడదల రజిని(vidadala rajini) స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీవీవీపీ కమిషనర్కు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. అధ్యాపకుడు రామకృష్ణ(Ramakrishna)కు అందిన వైద్యంపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కమిటీని నియమించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదంలో గాయపడిన అధ్యాపకుడు రామకృష్ణ మృతి కలిచివేసిందని... ఈ ఘటన బాధాకరమన్నారు. కమిటీ నివేదికలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు. ఎక్కడ లోపాలు తలెత్తిన కఠిన చర్యలు తప్పవని మంత్రి విడదల రజిని హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే...
బైక్ యాక్సిడెంట్కు గురై తీవ్రగాయాలతో అధ్యాపకుడు రామకృష్ణ, చిరంజీవి అనే మరో వ్యక్తి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వారికి చికిత్స చేశారు. తలకి కట్లు కట్టడం, సెలైన్లు పెట్టడం అంత సెక్యూరిటీ గార్డులు, స్వీపరులే చేశారు. డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ వేసి సరిపెట్టుకున్నాడు. కాగా లెక్చరర్ రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ అంబులెన్స్లో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందారు. ఆత్మకూరు ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడం వల్లే రామకృష్ణ చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.