విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి కౌలు రైతు బలి
ABN, First Publish Date - 2022-05-14T09:13:25+05:30
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి కౌలు రైతు బలి
కూచిపూడి, మే 13 : విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కౌలు రైతు ప్రాణం తీసింది. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో శుక్రవారం జరిగిన సంఘటన వివరాలు...గ్రామానికి చెందిన రైతు లంకా సాంబశివరావు పొలం కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వీచిన గాలులకు పొలంలో నుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. రోజు మాదిరిగా పొలంలో బీరకాయలు కోసుకోవటానికి వెళ్లిన సాంబశివరావు (62)కు తెగి పడిన విద్యుత్ వైర్లు తగలటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రాణం తీసిందంటూ మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.