APలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు
ABN, First Publish Date - 2022-05-03T19:17:48+05:30
ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకరేమో చంపుతామని...
నంద్యాల జిల్లా: ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకరేమో చంపుతామని మహిళా ఎస్ఐకి ఫోన్లో బెదిరిస్తే.. మరొకరేమో ఏకంగా తాను చెప్పినట్లు విననందుకు సచివాలయ ఉద్యోగిపై దాడి చేశాడు. అధికార మదంతో వైసీపీ శ్రేణులు చెలరేగిపోతున్నారు. గత నెల 25న నంద్యాలకు చెందిన రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని వైసీపీ నేత సాయినాథ్ రెడ్డి కబ్జా చేశాడు. దీనిపై స్పందన కార్యక్రమంలో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. భూ కబ్జాలపై విచారణ చేపట్టాలని మూడవ పట్టణ మహిళా ఎస్ఐకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. దీంతో ఆమె వైసీపీ నేత సాయినాథ్ రెడ్డికి ఫోన్ చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆయన ఎస్ఐపై బూతులతో చెలరేగిపోయాడు. ‘నన్నే పోలీస్ స్టేషన్కు పిలుస్తారా? నీకు ఎంత ధైర్యమంటూ..’ మహిళా ఎస్ఐపై సాయినాథ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగని వైసీపీ మూక.. ఎస్ఐను బెదిరించారు. దీంతో ఎస్ఐ తన విధులకు ఆటంకం కలిగించాడని, బెదిరింపులకు దిగాడని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. సాయినాథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు వైసీపీ మూకను కేసు నుంచి రక్షించేందుకు కొంతమంది స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు నంద్యాలలోని 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కుమారుడు రెచ్చిపోయాడు. సచివాలయం ఉద్యోగిపై దాడి చేశాడు. తాను చెప్పినట్లు ఎందుకు చెయ్యవంటూ ఉద్యోగి వెంకట సుధాకర్పై బండ బూతులతో చెలరేగిపోయాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనలో సుధాకర్కు గాయాలయ్యాయి. శివకుమార్ దాడిని ఖండిస్తూ సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. శివకుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శివకుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.