ఎపిడ్రిన్ తెచ్చింది ‘తంబి’యే!
ABN, First Publish Date - 2022-05-08T06:13:15+05:30
విజయవాడ నుంచి కొరియర్లో పార్సిల్ అయిన ఎపిడ్రిన్ వెనుక ఉన్న తమిళ ‘తంబి’ ఎవరన్నది తేలిపోయింది.
అతడే సూత్రధారి
సగం తెలుగు, సగం తమిళంలో సంభాషణ
ఈఆర్సీ బీచ్ రోడ్డులో ఆధార్కార్డు మార్ఫింగ్
అతిగా ఊహించుకుని ఇరుక్కున్న తేజ
ఆంధ్రజ్యోతి - విజయవాడ : విజయవాడ నుంచి కొరియర్లో పార్సిల్ అయిన ఎపిడ్రిన్ వెనుక ఉన్న తమిళ ‘తంబి’ ఎవరన్నది తేలిపోయింది. చెన్నైలో అనేక కొరియర్ సర్వీసులు ఉండగా అతడు విజయవాడకు ఎందుకు వచ్చాడన్న విషయంలోనూ ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు తంబి చేసిన పనిలో తలో భాగం పంచుకున్న మిగిలిన వారు ఎవరన్నది తేలాల్సి ఉంది. చెన్నైలో కంచి పట్టుచీరలను కొనుగోలు చేసి ఎపిడ్రిన్ పొడిని వాటి మధ్యన పెట్టి నేరుగా విజయవాడకు వచ్చినట్టు తేలింది. కొరియర్లో ఉన్న వారితో పరిచయం పెంచుకోవడానికి మూడు, నాలుగు సార్లు పచ్చడులు పార్సిల్ చేశాడు. ఇక్కడ మొత్తం స్వరూపంపై ఒక అవగాహన వచ్చిన తర్వాత అసలు సరుకును తీసుకొచ్చాడు. బెంగళూరు కస్టమ్స్ అధికారులకు డీఎస్టీ (డిస్టెన్స్ స్పీడ్ టైం) కొరియర్ సర్వీసెస్ ఉద్యోగి గుత్తుల తేజ ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో చెన్నైకి చెందిన అరుణాచలం పేరును పోలీసులు అండర్లైన్ చేశారు. ఆ ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్లో ఉంది. అతడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఎపిడ్రిన్ ఎపిసోడ్కు పాత్రధారి, సూత్రధారి అరుణాచలమేనని దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి పరారీలో ఉన్నా తమకు చిక్కడం ఖాయమని పోలీసులు కచ్చితంగా చెబుతున్నారు. విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. కొంతమంది గంజాయిని ఇక్కడ భద్రంగా ఉంచి యువతకు విక్రయిస్తున్నారు. దీనిపై టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయికి సంబంధించిన అన్ని మార్గాలపైనా పోలీసులకు మంచి అవగాహన ఉంది. చెన్నైలో ఎపిడ్రిన్ విషయంలో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. కొరియర్ సర్వీసుల నుంచి వెళ్తున్న పార్సిళ్లను తెరచి మరీ చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎపిడ్రిన్ అక్కడి నుంచి పార్సిల్ చేయడం కష్టమని స్మగ్లర్లు భావించారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్ను ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. చెన్నైలో ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్)బీచ్లో ఎక్కువగా సైబర్ నేరాలకు సంబంధించి స్థావరాలు ఉంటాయి. ఆధార్ కార్డుల మార్ఫింగ్, నకిలీ ధ్రువీకరణపత్రాల తయారీకి ఈ బీచ్ కేంద్రం. ఫొటోస్టాట్ షాపు నుంచి సేకరించిన గోపీసాయి ఆధార్ కార్డును ఇక్కడే మార్ఫింగ్ చేసినట్టు తెలిసింది. మొత్తం చిరునామా గోపీసాయిది ఉంచి, ఫొటో మాత్రం అరుణాచలం పెట్టుకున్నాడు. కొరియన్ సర్వీసు నుంచి పార్సిల్ ఇచ్చేటప్పుడు ఆధార్కార్డు ఫొటోస్టాట్ కచ్చితంగా ఇవ్వాలి. సత్తెనపల్లి చిరునామాతో ఉన్న ఆధార్కార్డు చూపించి అక్కడ పార్సిల్ ఇస్తే కొరియర్లో వారికి అనుమానం రావొచ్చు. ఒకవేళ పోలీసుల తనిఖీలు చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. చిరునామా సత్తెనపల్లిది కావడంతో దీనికి సమీపంగా ఉన్న నగరాలను చూసుకున్నాడు. ప్రయాణ మార్గానికి విజయవాడ అనుకూలంగా ఉండడంతో దీన్ని ఎంచుకున్నాడు. గూగుల్లో కొరియర్ సర్వీసుల కోసం చూసుకున్నాడు. అందులో భారతీనగర్లో ఉన్న డీఎస్టీ కొరియర్స్ కనిపించింది. రైలులో ఇక్కడికి వచ్చి రెండు, మూడుసార్లు పచ్చళ్లు పార్సిల్ చేశాడు. ఆ తర్వాత ఎపిడ్రిన్ తీసుకొచ్చి పంపాడు.
అతి ఆలోచనతో...
బెంగళూరు విమానాశ్రయంలో ఉన్న పార్సిల్ తీసుకురావడానికి వెళ్లిన గుత్తుల తేజ అతి ఆలోచనతో ఇరుక్కుపోయాడు. తనది కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామమని, డీఎస్టీ కొరియర్లో ఉద్యోగిగా పనిచేస్తున్నానని కస్టమ్స్ అధికారులకు చెప్పాడు. ఈ పార్సిల్ ఎవరిదని ప్రశ్నించినప్పుడు తనదేనని ఒప్పుకున్నాడు. ఒకవేళ పార్సిల్ తనది కాదని, మరో వ్యక్తి ఇస్తే తాను కొరియర్ చేశానని చెప్తే అతడ్ని అధికారులు పిలుస్తారన్న యోచనలో ఈవిధంగా చెప్పినట్టు తెలుస్తోంది. కొరియర్ సర్వీసుల నుంచి డ్రగ్లు ప్యాక్ అవుతుండడంతో వాటిల్లోనూ తనిఖీలు నిర్వహించాలన్న నిర్ణయానికి పోలీసులు వచ్చారు.