కనీస వసతుల కొరతతో రాయచోటి ప్రజల సతమతం
ABN, First Publish Date - 2022-05-08T05:15:48+05:30
మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అన్నారు.
రాయచోటిటౌన్, మే7: మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన సీపీఐ సహాయ కార్యదర్శి జక్కల వెంకటేష్, కార్యవర్గ సభ్యులు వంగిమళ్లరంగారెడ్డి, బత్తల వెంకట్రమణ, పోలూరు అశోక్తో కలిసి పట్టణంలోని 25, 26 వార్డుల్లో మురుగుకాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చినా, మున్సిపాలిటీ పరిధిలో మాత్రం ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు వారానికి ఒక రోజు అందుతుండగా, వెలగని వీధి దీపాలు, గుంతలమయమైన సీసీ రోడ్లతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. ప్రధాన వీధుల్లో డ్రైనేజీ ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించడంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికార యంత్రాగానికి తలనొప్పిగా మారాయన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించి డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించడంతోపాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.