YS Kondareddy ని కడప జిల్లా నుంచి బహిష్కరించడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..!?
ABN, First Publish Date - 2022-05-12T07:00:00+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి (YS Jagan mohan Reddy) వరుసకు సోదరుడు అయిన వైఎస్ కొండారెడ్డిని (YS Konda Reddy) జిల్లా బహిష్కరణ కోసం..
- తెలంగాణలో షర్మిల పాదయాత్రలో ఈయన కీలకం
- దీంతో కొండారెడ్డిపై జగన్ గుర్రు
- జిల్లాలో వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ
(కడప-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి (YS Jagan mohan Reddy) వరుసకు సోదరుడు అయిన వైఎస్ కొండారెడ్డిని (YS Konda Reddy) జిల్లా బహిష్కరణ కోసం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపడంపై వైసీపీ వర్గాలతో పాటు జిల్లాలోని ఇతర పార్టీల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైఎస్ కొండారెడ్డి చక్రాయపేట మండల వైసీపీ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. చాగలమర్రి - రాయచోటి రహదారి పనులను ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తోంది. ఈ పనులను ఈయన అడ్డుకోవడంతో పాటు వాటా ఇవ్వాలని సిబ్బందిని బెదిరించిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి గత సోమవారం జైలుకు పంపారు.
కొండారెడ్డి దుడుకుగా ఉండేవారని అంటుంటారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శంకర్రెడ్డికి ఈయనకు మధ్య విభేదాలు ఉన్నాయని సమాచారం. ఏడాది క్రితం గాలివీడులో సోలార్ప్లాంట్ నిర్మాణం సందర్భంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయం సీఎం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అలాగే చక్రాయపేటలో మైనింగ్ లీజులతో పాటు ఏ పనులు చేయాలన్నా ఆయన ఎంటర్ అవుతారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ కంపెనీని డబ్బులు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని బీజేపే పెద్దలు సీరియ్సగా తీసుకోవడంతో వైఎ్స కొండారెడ్డి అరెస్టుకు చకచకా పావులు కదిలాయని సమాచారం.
ఈ నేపథ్యంలో కొండారెడ్డి తెలంగాణలో షర్మిల పాదయాత్ర రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించడం, మరి కొన్ని ఘటనలు కూడా ఆయనపై సీఎం సీరియస్ అయ్యేందుకు కారణమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. వీటినంతా దృష్టిలో పెట్టుకుని.. బెదిరింపులు బ్లాక్మెయిల్కు పాల్పడితే సహించేది లేదని వరుసకు సోదరుడైన కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చేసేందుకు సీఎం వెనకాడలేదనే మెసేజ్ జనాల్లోకి పంపించేందుకు ఈ ప్రతిపాదన తెచ్చారని అంటున్నారు. అంటే జిల్లా బహిష్కరణ ద్వారా జనంలో సీఎం వైఎస్ జగన్కు మంచి పేరు రావడంతో పాటు.. తనకు ఇష్టం లేని పనులు చేస్తున్న వారికి హెచ్చరిక పంపినట్టుగా ఉంటుందని అంటున్నారు. వైఎస్ కొండారెడ్డిపై గతంలో ఎన్నో అభియోగాలు, ఆరోపణలు వచ్చినా సీఎం జగన్ అప్పుడు స్పందించకుండా ఇప్పుడు మాత్రం స్పందించడం పట్ల ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మంగళవారం కలెక్టర్, ఎస్పీ కలసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బెదిరింపులకు, అక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించమని.. జిల్లా బహిష్కరణకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. ఇంతలో వైఎ్స కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చేసేందుకు కలెక్టర్కు ప్రతిపాదన పంపినట్లు ఎస్పీ అన్బురాజన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు అవినీతి రహిత పాలనతోపాటు బెదిరింపులు, అక్రమాలకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యల్లో భాగంగా కొండారెడ్డి బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే దీనికి భిన్నంగా అంతర్గతంగా మరో చర్చ నడుస్తోంది.
వైఎస్ కొండారెడ్డి గతంలో ఇడుపులపాయ ఎస్టేట్ ఇన్చార్జ్గా పనిచేశారు. అప్పట్లో వైఎస్ జగన్ కడపకు వస్తే ఈయన అన్నీతానై చూసుకునేవారు. అనంతరం వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ వద్దని చెప్పినా వినకుండా తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ వైఎ్స షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర రూపకల్పనలో కొండారెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిల రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలో ఈయన ముఖ్యపాత్ర పోషించినట్లు చెబుతారు.