పట్టాలు మాయం
ABN, First Publish Date - 2022-05-07T10:59:33+05:30
మదనపల్లె గృహ నిర్మాణ శాఖలో వింత లీలలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులకు ఇ చ్చిన ఇంటి పట్టాలు మాయమయ్యాయి. ఇక్కడ పని చేసిన కొంతమంది సిబ్బంది ఈ పట్టాలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె అర్బన్లో నకిలీ పట్టాలు ఎక్కువగా ఉన్నాయని
ఓటీఎస్కు అడ్డంకి, ఇంటింటి సర్వేకి బ్రేక్
లబ్ధిదారుల ఆచూకీ దొరక్క అవస్థలు
గృహ నిర్మాణ శాఖ లీలలు
మదనపల్లె గృహ నిర్మాణ శాఖలో లబ్ధిదారుల పేరున జారీ చేసిన ఇంటి పట్టాలు కనిపించడం లేదు. ఇళ్లు మంజూరు చేసిన జాబితా కూడా కార్యాలయంలో లేదు. పట్టాలు అమ్మేయగా, అధికారులే జాబితా కనపడకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు వివిధ పథకాల్లో మంజూరు చేసిన ఇళ్ల జాబితాకు, కార్యాలయంలోని పట్టాలకు అసలు పొంతనే లేదు. ముఖ్యంగా మదనపల్లె అర్బన్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
మదనపల్లె, మే 6: మదనపల్లె గృహ నిర్మాణ శాఖలో వింత లీలలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులకు ఇ చ్చిన ఇంటి పట్టాలు మాయమయ్యాయి. ఇక్కడ పని చేసిన కొంతమంది సిబ్బంది ఈ పట్టాలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె అర్బన్లో నకిలీ పట్టాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తూ గతం లో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్లు కూడా కొన్ని పట్టా లు ఇవ్వకుండా మొండికేశారని తెలుస్తోంది. ఈ క్ర మంలో అటు హౌసింగ్, ఇటు రెవెన్యూ మధ్య పట్టాల వివాదం పెద్ద స్థాయిలోనే జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని హౌసింగ్ అధికారులు పట్టా లేకుండానే కొందరు లబ్ధిదారులకు డాక్యుమెంటేషన్ చేసి బిల్లులు మంజూరు చేశారు. ఈ ముసుగులోనే ఇక్కడ పనిచేసి న ఏఈలు, సిబ్బంది బిల్లులు అయిన తర్వాత లబ్ధిదారులకు బేరం పెట్టి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత వచ్చిన ఏఈ, డీఈలు కూడా ఇదే తరహాలో పట్టాలు మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం 1983 నుంచి 2011-12 వరకూ వివిధ పథకాల్లో మంజూరు చేసిన ఇళ్లను ఆన్లైన్ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా స్థానిక గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ (ఈఈ) కార్యాలయంలోని పట్టాలు, ఇతర రికార్డులకు దుమ్ము దులిపి, ఆయా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు చేర్చారు. ఈ క్రమంలో పట్టాలు, జాబితాల మాయం వెలుగులోకి వచ్చింది. తర్వాత ఓటీఎస్ పథకం అమలులోనూ క్షేత్ర స్థాయిలో అదే ఇబ్బంది ఎదురైంది. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జాబితాకు, హౌసింగ్ అధికారులు ఇచ్చిన జాబితాకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో చివరకు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు ఉన్న వాటితోనే అటు ఓటీఎస్, ఇటు క్షేత్రస్థాయి విచారణను మమ అనిపించారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇళ్లు మంజూరు చేయగా, వీటికి రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్లతో పాటు అనుబంధ పట్టాలు మంజూరు చేశారు. వీటి ఆధారంగా హౌసింగ్ అధికారులు..నిర్మాణాన్ని బట్టి బిల్లులు మంజూరు చేశారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) చేపట్టే క్రమంలో ఈఈ కార్యాలయంలోని పట్టాలను గ్రామాలు, మండలాల వారీగా విభజించి ఆయా వార్డు, గ్రామ సచివాలయాలకు పంపించారు. ఇందులో మండలానికి కనీసం 500 వరకుపైగా డాక్యుమెంట్లు, పట్టాల లెక్కతేలలేదు. ఇందులో మదనపల్లె మున్సిపాలిటీలోనే 5 వేలకుపైగా ఉన్నాయి. పట్టణంలోనే తీసుకుంటే, ప్రభుత్వం 13,560 ఇళ్లు మంజూరు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ 8 వేల పట్టాలకు మించి లేవు. మిగిలిన అయిదు వేలకుపైగా పట్టాలు కనిపించడం లేదు. వీటిలో కొన్ని రెవెన్యూ అధికారులు జారీ చేయకపోగా, మరికొన్నింటిని హౌసింగ్ అధికారులు అమ్మేసినట్లు ఆరోపణలున్నాయి. అదే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఓటీఎస్, ఇంటింటి సర్వేకే అడ్డంకిగా మారింది. అర్బన్ హౌసింగ్, ఇందిరమ్మ పథకాల్లో మంజూరు చేసిన లబ్ధిదారుల జాబితా, లేఅవుట్ల స్కెచ్ల ఆధారంగా క్షేత్ర స్థాయిలో విచారణ బృందాలు విచారణ చేపడుతున్నారు. అయితే పట్టాలు, లబ్ధిదారుల జాబితా లేకపోవడంతో వారి ఆచూకీ తెలియడం లేదు.
ఓటీఎ్సకూ అదే సమస్య
వన్టైం సెటిల్మెంటు కింద మొదటి విడత 5228 మంది పేర్లను జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రభు త్వ లెక్కల ప్రకారం వారంతా నిర్మాణం పూర్తి చేసి ఫైనల్ బిల్లుతో సహా తీసున్నవారే. ఆ జాబితాపై రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటీఎ్సలో చేర్పించారు. వీటిలో కూడా వెయ్యి మందికిపైగా ఆచూకీ దొ రకలేదు. ఇదిలా ఉండగా నవరత్నాల్లో భాగంగా పట్టణంలో హౌసింగ్ లబ్ధిదారులకు స్థల సమస్య తలెత్తిం ది. ఈ క్రమంలో గతంలో ఇళ్లు కేటాయించిన లేఅవుట్లలో ఖాళీగా ఉన్న, పునాది, గోడలు పూర్తి చేసి వదిలేసిన వాటిపై విచారణ చేపట్టారు. ఇందులోనూ చాలామంది లబ్ధిదారుల చిరునామా చిక్కలేదు. హౌసింగ్ కార్యాలయంలో పట్టాలే కాదు..ఆ జాబితా కూడా దొరకలేదు. ఉన్న స్కెచ్ల ఆధారంగా చేస్తే, 700కు పైగా ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే గతంలో వీటిని ఎవరికి కేటాయించారు..? పట్టా ఎవరి పేరున జారీ చేశారన్న లెక్కలు లేకపోవడంతో సర్వేకి బ్రేక్పడింది. క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం స్థలం ఖాళీగా ఉందని, ఇతరులకు కేటాయిస్తే, తర్వాత తనకు పట్టా ఉందని అసలైన లబ్ధిదారుడు వస్తే పరిస్థితి ఏంటి? అసలు అతడికి నోటీసు ఇవ్వకుండానే పట్టా రద్దు చేస్తే ఎలా? భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులను దృష్టిలో పెట్టుకుని అధికారులు సర్వేను తాత్కాలికంగా నిలిపేశారు. అప్పట్లో కొందరికి ఇల్లు కట్టుకోకపోయినా బిల్లులు మంజూరు చేశారు. పట్టాలు కూడా రెవెన్యూ అధికారులే కొందరి లబ్ధిదారులకు ఇచ్చేయగా, మరికొన్ని గృహ నిర్మాణ శాఖ ఏఈ, సిబ్బంది అమ్మినవీ ఉన్నాయి. ఖాళీగా ఉన్న 700 స్థలాల్లో ఈ సమస్యలన్నీ మిళితమై ఉన్నాయి. మరోవైపు ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో..ఇన్నేళ్ల తర్వాత స్థలాన్ని లేక అసంపూర్తి నిర్మాణాన్ని స్వాధీనం చేసుకుంటే, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురై ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయమూ రాజకీయ నాయకులను వెంటాడుతోంది.
సచివాలయాలకు పంపేశారు..
- కె.నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, గృహ నిర్మాణశాఖ, మదనపల్లె
నేను ఇక్కడికి వచ్చే నాటికే మా కార్యాలయం నుంచి ఆయా వార్డు, గ్రామ సచివాలయాలకు ఇచ్చేశారు. మాయం అయినట్లు నా దృష్టికి రాలేదు. ఎన్ని పట్టాలు లేవో గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు కనుక్కుంటా. ఏ స్థాయిలో గల్లంతయ్యాయో తెలుసుకుని ఉన్నతాఽధికారులకు నివేదిస్తా.