సీఎం జగన్కు రామకృష్ణ లేఖ
ABN, First Publish Date - 2022-05-14T15:16:52+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. తుఫాన్, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, తక్షణమే రైతాంగానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల అసని తుఫాన్ వల్ల రైతులకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. దాదాపు ఎకరాకు రూ.50 వేల నుండి లక్ష వరకు నష్టం జరిగిందన్నారు. 2021 నవంబర్ 18 నుండి 23 వరకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు 65 మందికి పైగా చనిపోయారని లేఖలో తెలిపారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు తెగిపోవటం, ఇళ్లు కూలిపోవడం, వాగులు వంకలు పొంగి పొరలటం జరిగిందన్నారు. 6 మాసాలు గడిచినప్పటికీ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పటివరకు అందలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకపోవడం తగదన్నారు. తుఫానులు, వరదల బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి, తగు నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.