తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
ABN, First Publish Date - 2022-05-11T18:00:08+05:30
తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలో అసనీ(Asani) తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) బుధవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష చేపట్టారు. తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో హై అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలను తెరవాలని అన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, జనరేటర్లు, జేసీబీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ తెలిపారు.