ఏపీలో దయనీయంగా రైతుల పరిస్థితి: Somu veerraju
ABN, First Publish Date - 2022-05-10T19:25:08+05:30
రాష్ట్రంలో రైతల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో రైతల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ నేత సోము వీర్రాజు(Somu Veerraju) అన్నారు. గన్నవరంలో బీజేపీ పదాధికారుల, శక్తి కేంద్రాల ప్రతినిధులు సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ... ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. 151 స్థానాలు ఇస్తే.. అప్పులు చేసి పాలన చేయమని కాదని అన్నారు. రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి పధంలో పయనించకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను వాడుకుని ఆదాయం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాత్రం ఆస్తులను పెంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అంశాలపై సమీక్ష చేసే జగన్(Jagan) .. అప్పుల మీద ఎందుకు సమీక్షించరని నిలదీశారు. నేడు అప్పు కూడా పుట్టని పరిస్థితికి తెచ్చారని అన్నారు. రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోతున్నా జగన్కు పట్టదని ఆయన విమర్శించారు.
మహిళపై దాడులు చేస్తే శిక్షించడం లేదన్నారు. హోం మంత్రి(Home minister) కనీసం స్పందించలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మతపరమైన ముఖ్యమంత్రిగా జగన్ను పరిగణించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తే తమ నాయకులపై కేసులు పెడతారా అని నిలదీశారు. హిందూ వ్యతిరేక వేఖరిని సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే నేరుగా చంపేస్తామని బెదిరిస్తారా అంటూ బీజేపీ నేత ఆగ్రహించారు.
వచ్చే నెల 5, 6 తేదీలలో రాజమండ్రి, విజయవాడలో సభలు నిర్వహిస్తామని... ఈ సభలకు జేపీ నడ్డా ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు. 2024 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా బ్లూ ఫ్రింట్ సిద్ధం చేస్తున్నామన్నారు. ‘‘చంద్రబాబు మా గురించి ఏమీ మాట్లాడలేదు. మా పేరు ప్రస్తావిస్తే మేము స్పందిస్తాం’’ అని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీల పాలనను వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము జనసేన కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సోమువీర్రాజు స్పష్టం చేశారు.